- ‘అడ్డొస్తే కాల్చి పారేస్తా… లారీలతో తొక్కిస్తా’
- నక్సలైటుననీ ఖబర్దార్ అంటూ బెదిరింపులు
- ఉద్యోగులు, అధికారులలో భయాందోళన
- మావోలు ఇలా బెదిరించమని చెప్పారా?
- కేంద్ర గూఢచార సంస్థలకు తెలిస్తే ప్రమాదం
- అసలే కేంద్రం మావోలను ఎరివేస్తున్న పరిస్థితి
సహనం వందే, హైదరాబాద్:
వ్యవసాయ దాని అనుబంధ శాఖలకు చెందిన అనేక కార్పొరేషన్లలో ఒక కార్పొరేషన్ చైర్మన్ వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. తనకు మావోయిస్టు బ్యాక్గ్రౌండ్ ఉందని గొప్పగా చెప్పుకుంటూ… ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రతిపక్ష కేడర్, మీడియా, ప్రైవేట్ వ్యాపారులను ఆయన బహిరంగంగా బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘నేను గతంలో నక్సలైట్లలో పనిచేశా… నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి… నన్ను విమర్శిస్తే నా బ్యాక్గ్రౌండ్తో బయటకొస్తా… నాతో పెట్టుకుంటే ఖతమే’ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మావోయిస్టులు ఇలాంటి బెదిరింపులకు పాల్పడరని ఉద్యోగులు అంటున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. దారి తప్పిన మాజీ మావోయిస్టులే ఇలాంటి బెదిరింపులు చేస్తారని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కొందరు సీనియర్ అధికారులు, ఉద్యోగులు గతంలో మావోయిస్టు సానుభూతిపరులుగా పనిచేసిన వారున్నారు. వారికి కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి తాము చైర్మన్ బెదిరింపులకు లొంగిపోయేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఉండే బ్యాక్ గ్రౌండ్ వాళ్లకు ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.
‘అడ్డొస్తే కాల్చి పారేస్తా… లారీలతో తొక్కిస్తా’
ఇక ప్రైవేట్ కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆ చైర్మన్ పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నాకు అడ్డొస్తే కాల్చి పారేస్తా… లేకుంటే లారీలతో తొక్కిస్తా’ అంటూ ఆయన చేస్తున్న బెదిరింపులు వ్యాపారుల్లో, ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. స్థానిక వ్యాపారులు ఈ బెదిరింపుల కారణంగా తమ వ్యాపారాలను కొనసాగించడం కష్టంగా మారిందని, తాము నిరంతరం బెదిరింపులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలు రుజువైతే ఇది కేవలం బెదిరింపులకే పరిమితం కాకుండా, ఆర్థిక నేరాల కింద, బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడిన నేరంగా కూడా పరిగణించబడవచ్చు. ప్రజా ప్రతినిధి ముసుగులో ఇలాంటి అక్రమాలకు పాల్పడటం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మీడియాపైనా బెదిరింపులు…
మీడియా సంస్థలను కూడా ఈ చైర్మన్ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తనపై విమర్శనాత్మక కథనాలు రాస్తే, తన బ్యాక్గ్రౌండ్తో బయటకొస్తానంటూ హెచ్చరిస్తున్నారని కొందరు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి బెదిరింపులు పత్రికా స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బెదిరింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు ముఖ్యమంత్రిని కోరుతున్నాయి.
మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం…
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మందిని హతమారుస్తోంది. ఈ తరుణంలో ఒక ప్రజా ప్రతినిధి, అది కూడా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి తాను మావోయిస్టునని చెప్పుకోవడం, బెదిరించడం చట్టపరంగా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ వ్యాఖ్యలు రికార్డు అయి కేంద్ర గూఢచార సంస్థల చేతికి చిక్కితే, ఆయనపై తీవ్రమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మావోయిస్టులపై నిషేధం కూడా ఉంది. మావోయిస్టు సానుభూతిపరుడంటూ ప్రొఫెసర్ సాయిబాబాను ఏళ్ల తరబడి జైల్లో పెట్టిన విషయాన్ని మరిచిపోరాదు. కాబట్టి గొప్పలకు పోయి మావోయిస్టునని చెప్పుకోవడం వల్ల ఆ చైర్మన్ కు తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యమంత్రి నుంచి నేర్చుకోలేరా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి ప్రభుత్వ పెద్దలు విమర్శలను సానుకూలంగా తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి ప్రతి రోజు విమర్శలు, ప్రశంసలు వస్తూనే ఉంటాయి. కానీ ఆయన విమర్శలను నిర్మాణాత్మకంగా తీసుకుంటూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కానీ కేవలం ఒక సంస్థకు చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇలా బెదిరింపులకు పాల్పడడంపై విమర్శలు వస్తున్నాయి. సీఎం నుంచి ఆయన ఏం నేర్చుకుంటున్నారని ఉద్యోగులు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్లు ప్రజల ఆస్తుల పట్ల, ప్రభుత్వ సంస్థల పట్ల అత్యంత బాధ్యతగా ఉండాలి. అంతేకానీ తమ సొంత జాగీరులా భావించడానికి వీలు లేదని అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.