నంబాల ఎన్కౌంటర్… అనుమానాలు, ఆరోపణలు
సహనం వందే, హైదరాబాద్:
ఛత్తీస్గఢ్లోని అబుజ్మఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బసవరాజు) మరణంపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎన్కౌంటర్ జరిగిందని చెబుతుండగా, పౌరహక్కుల సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం విషమిచ్చి చంపారనో లేక ఎక్కడో కాల్చి చంపి అడవుల్లో పడేశారనో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల మృతదేహాన్ని అప్పగించడంలో పోలీసుల నిరాకరణ, రీ-పోస్టుమార్టం భయం చుట్టూ అలుముకున్న రహస్యాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అప్పగింతపై పోలీసుల అభ్యంతరం…
సాధారణంగా ఎన్కౌంటర్ల తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కానీ నంబాల విషయంలో పోలీసులు మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పౌరహక్కుల నేతల ఆరోపణల ప్రకారం మృతదేహాన్ని అప్పగిస్తే రీ-పోస్టుమార్టం కోసం కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని, ఆ భయంతోనే పోలీసులు అంగీకరించడం లేదు. ఒకవేళ అనుమానాలే నిజమైతే పోలీసులే హడావుడిగా దహన సంస్కారాలు చేయిస్తారే తప్ప కుటుంబ సభ్యులకు ఇవ్వరని కూడా పౌరహక్కుల నేతలు అభిప్రాయపడుతున్నారు.
పోస్టుమార్టం ఏం వెల్లడిస్తుంది?
నంబాలను విషమిచ్చి చంపారా లేక నకిలీ ఎన్కౌంటర్ చేశారా అనే ఆరోపణలకు రీ-పోస్టుమార్టం సమాధానం ఇస్తుందని పౌరహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. పోస్టుమార్టం ద్వారా టైమ్ ఆఫ్ డెత్ ను కచ్చితంగా అంచనా వేయవచ్చు. పోలీసులు ప్రకటించిన ఎన్కౌంటర్ సమయానికి, నంబాల వాస్తవంగా చనిపోయిన సమయానికి మధ్య తేడాను పోస్టుమార్టం గుర్తించగలదు. నిజంగా ఎన్కౌంటర్లోనే చనిపోతే సమయం పెద్దగా మారదు. కానీ ఎన్కౌంటర్లో కాకుండా మరెక్కడో కాల్చి చంపి, ఆ తర్వాత అడవుల్లో పడేసినట్లయితే, ఆ విషయం పోస్టుమార్టంలో బయటపడుతుంది.
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ:
వాస్తవాలు ఏమైనప్పటికీ బసవరాజు మరణం నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు తీవ్రమైన దెబ్బగా పరిగణిస్తున్నారు. తన సొంత ప్రధాన కార్యాలయంలో రక్షణ బృందం ఉన్నప్పుడే ఈ ఘటన జరగడం మావోయిస్టులకు ఊహించని షాక్గా నిలిచింది. అతని మరణం నక్సలైట్ ఉద్యమంలో గణనీయమైన లోటుగా పరిగణించవచ్చు. అబుజ్మఢ్ వంటి బలమైన కేంద్రంలో అతని రక్షణ బృందం ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్ విజయవంతం కావడం భద్రతా బలగాల వ్యూహాత్మక శక్తిని సూచిస్తుంది.