ఒకే వ్యూహం… ఒకే గేమ్

  • ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు, రేవంత్ వేట
  • గురుశిష్యుల ఒకే రకమైన రాజకీయ ఆట
  • తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ రివెంజ్
  • జగన్, కేసీఆర్‌లపై కక్షసాధింపు చర్యలు
  • వారిద్దరినీ అరెస్ట్ చేస్తారన్న ప్రచార హోరు
  • రాజకీయంగా అరెస్టులకు ఇదే అదను!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు… మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులపై పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాయి. వారిపై అవినీతి ఆరోపణలతో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది‌. కేసీఆర్, జగన్‌లను అరెస్టు చేయడానికి ఇదే సరైన సమయంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భావిస్తున్నాయని, మరింత ఆలస్యం చేస్తే రాబోయే ఎన్నికలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రుల సన్నిహితులను, క్యాడర్‌ను, ముఖ్యమైన నేతలను అరెస్టు చేయడం ద్వారా బీఆర్ఎస్, వైసీపీ పార్టీలలో భయభ్రాంతులు సృష్టించాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు టీడీపీ ప్రభుత్వం భావిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… వీరిద్దరూ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులపై ఒకే విధమైన వ్యూహంతో రాజకీయ ఆట ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సాగుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌పై లిక్కర్ స్కామ్…
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన వెంటనే ఈ ఆరోపణలు మళ్ళీ తెరపైకి రావడం గమనార్హం. 2023 సెప్టెంబర్ 10న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో గంటల తరబడి తిప్పి, హడావిడిగా అరెస్ట్ చేసిన సంఘటనను గుర్తుచేస్తూ, జగన్‌ను కూడా బెంగళూరులో అదే తరహాలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థలు సంచలన కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ‘లిక్కర్ స్కామ్‌లో జగన్ అరెస్ట్ అనివార్యం’ అని కొన్ని ఛానళ్లు జోస్యం చెబుతుండగా, ఈ ఆరోపణల వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందని వైసీపీ బలంగా వాదిస్తోంది. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంత సులభమా? ఇది కేవలం న్యాయపరమైన చర్య కాదని, అధికార పక్షం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న హడావిడి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

జగన్‌కు అరెస్ట్‌లు కొత్త కాదు…
2012లో అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే అనుభవజ్ఞుడు. అయినప్పటికీ ఈసారి ఆరోపణల తీవ్రత, వాటి వెనుక ఉన్న రాజకీయ ఒత్తిడులు ఆయనను కట్టడి చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కొందరు అధికారులను అరెస్టు చేసిన నేపథ్యంలో, దర్యాప్తు వేగవంతం కావడం గమనార్హం. తాడేపల్లిలోని తన నివాసంలో నాయకులతో నిర్వహిస్తున్న వరుస సమావేశాల్లో జగన్, ‘మీరే పార్టీ యజమానులు. నిర్ణయాలు మీరే తీసుకోండి’ అంటూ జిల్లా అధ్యక్షులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ వ్యూహం వెనుక ఆయన అరెస్ట్ అయినా, పార్టీ బలంగా ఎదుర్కొనేలా సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. 26 జిల్లాల్లో వైసీపీ క్యాడర్‌ను యాక్టివేట్ చేసేందుకు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ, పార్టీని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. పార్టీ నేతలు కూడా జగన్‌కు మద్దతుగా బహిరంగ ప్రకటనలు చేస్తూ, ఇది రాజకీయ ప్రతీకారమే అని ఖండిస్తున్నారు.

తెలంగాణలో కాళేశ్వరం రగడ…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం మరోసారి రాజకీయ రణక్షేత్రంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌లకు పినాకి చంద్రఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5, 6, 9 తేదీల్లో వీరు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తన బ్రెయిన్‌చైల్డ్ గా చెప్పుకున్న కేసీఆర్‌పై అవినీతి, అవకతవకల ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని, డిజైన్ లోపాలున్నాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే 110 మంది అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను విచారించిన కమిషన్, అప్పటి పాలకుల నిర్ణయాలే అవినీతికి కారణమని అఫిడవిట్ల ద్వారా తేల్చింది. అయినప్పటికీ కేసీఆర్‌ను విచారించకుండా రిపోర్ట్ సమర్పిస్తే, అది న్యాయసమీక్షలో నిలబడదని న్యాయ నిపుణులు హెచ్చరించడంతో, కమిషన్ గడువును జులై 31 వరకు పొడిగించారు. కానీ ఈ నోటీసుల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కసరత్తుగా బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. బీఆర్‌ఎస్ వర్గాలు దీనిని ప్రతీకార విచారణగా అభివర్ణిస్తున్నాయి. గతంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులను కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేసిన నేపథ్యం ఉంది. ఈసారి కూడా ఆయన అదే మార్గాన్ని ఎంచుకుంటారా? లేక విచారణకు హాజరై తన వాదన వినిపిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ నాయకులను వివిధ కేసుల్లో లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, అది కోర్టుల్లో సవాల్‌కు గురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ విచారణలు నిజంగా అవినీతిని బయటపెట్టేందుకా లేక రాజకీయ ప్రతీకారం కోసమా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది.

రాజకీయ కక్షసాధింపు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటూ విచారణలు చేపడుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రలో లిక్కర్ స్కామ్‌లో జగన్‌ను లక్ష్యంగా చేసుకుని, ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన అధికార పక్షం, రాజకీయంగా వైసీపీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. జగన్ ను ఇప్పుడే అరెస్టు చేస్తే ప్రయోజనం ఉంటుందని, సమయం తీసుకుంటే రాజకీయ నష్టం వాటిల్లుతుందని అధికార పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ అరెస్ట్ అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్యాడర్ ఆందోళనలు, నిరసనలతో అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్న తరుణంలో, రాజకీయ ఉద్రిక్తతలు మరింత భారాన్ని పెంచవచ్చు. అదే సమయంలో తెలంగాణలో కాళేశ్వరం విచారణలు కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కసరత్తుగా బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విచారణలు న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా సాగకపోతే, ప్రజల్లో ప్రభుత్వాలపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని గమనించాలి.

న్యాయం గెలుస్తుందా?
ఈ రెండు కేసులు రాజకీయ, న్యాయ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని పరీక్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరెస్ట్ అయితే, అది రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అలజడికి దారితీస్తుంది. వైసీపీ క్యాడర్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడితే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా తెలంగాణలో కాళేశ్వరం విచారణలు కేసీఆర్‌ను కోర్టుల్లో సవాల్ చేసేందుకు దారితీస్తే, కమిషన్ నివేదిక న్యాయపరంగా నిలబడకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ విచారణలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా సాగకపోతే, అవినీతి నిరోధక చర్యల కంటే రాజకీయ ప్రతీకారంగానే ప్రజలు భావిస్తారు. రాజకీయ లబ్ధి కోసం న్యాయ వ్యవస్థను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి సవాలు అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *