ఆయిల్ పామ్ మొక్కల్లో జన్యు లోపాలు

  • నాసిరకం మొక్కలతో తీవ్ర నష్టం
  • ఆయిల్ ఫెడ్ పై అన్నదాతల ఆగ్రహం
  • ఆదుకోవాలని రైతు కమిషన్ కు విన్నపం
  • రైతులకు భారంగా ఆయిల్ ఫెడ్ విధానాలు

రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలు రైతులకు నిరాశ మిగిలిస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ జోన్‌లో 1993 నుండి 2015 వరకు మంచి నాణ్యత గల మొక్కలను అందించినప్పటికీ, 2016 నుండి నర్సరీల ద్వారా సరఫరా చేసిన మొక్కల్లో గణనీయమైన శాతం (20% నుండి 50% వరకు) జన్యు లోపాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొక్కలు 6-7 సంవత్సరాలు గడిచినా కాయలు కాయకపోవడంతో, రైతులు లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల పాటు ఆదాయం వస్తుందని ఆశపడ్డ రైతుల జీవనాధారం ప్రమాదంలో పడింది.

అధికారుల నిర్లక్ష్యం… రైతులకు శాపం
ఆయిల్ పామ్ రైతు సంఘం గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ ఎండీలు సురేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, షేక్ యాస్మీన్ భాషాలకు పదేపదే వినతిపత్రాలు సమర్పించినా, ఎవరి నుండి సరైన స్పందన రాలేదు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రషీ శివరాజ్ సింగ్ సౌహన్‌ను సైతం కలిసి, శాస్త్రవేత్తలతో తోటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని కోరినా, అధికారుల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నిర్లక్ష్య వైఖరి రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

కంపెనీల మోసంతో రైతుల ఇబ్బందులు!
ఆయిల్ పామ్ విత్తన దిగుమతికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన క్వారంటైన్ నిబంధనలను కొన్ని కంపెనీలు సరిగా పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఐఐఓపీఆర్-పెడవేగి, వెస్ట్ గోదావరిలో వైరస్, ఫంగస్ టెస్టుల కోసం విత్తనాలను పంపాలని నియమం ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ నాసిరకం మొక్కలను రైతులకు అందిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి రైతులను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

ఆయిల్ పామ్‌కు దక్కని న్యాయం…
మొక్కజొన్న, వరి, పత్తి వంటి స్వల్పకాలిక పంటలలో నకిలీ విత్తనాలపై నష్టపరిహారం ఇస్తున్నప్పుడు, 30 సంవత్సరాల దీర్ఘకాలిక పంట అయిన ఆయిల్ పామ్‌కు ఎందుకు నష్టపరిహారం ఇవ్వరు అనే ప్రశ్న తలెత్తుతోంది. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న విత్తనాలను సొంత నర్సరీలలో పండించి, నాసిరకం మొక్కలను రైతులకు అందించే కంపెనీలు నష్టపరిహార బాధ్యతను తప్పించుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫెడ్‌తో పాటు 13 ప్రైవేటు కంపెనీలకు ఆయిల్ పామ్ సాగును అప్పగించడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది.

చట్ట సవరణ… నష్టపరిహారం కోసం డిమాండ్!
ఆయిల్ పామ్ రైతు సంఘం కొత్త విత్తన చట్టంలో ఆయిల్ పామ్‌ను చేర్చాలని, నాసిరకం మొక్కలు ఇచ్చిన కంపెనీలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఆయిల్ పామ్ యాక్ట్‌ను సవరించి, రైతులకు న్యాయం చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని అభ్యర్థిస్తోంది. రైతుల జీవనాధారాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే, ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అశ్వరావుపేట ఆయిల్ పామ్ గ్రోవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కోదండ రెడ్డిని కలిసి విన్నవించారు.

జన్యులోపం ఉందని ఒప్పుకున్న ఆయిల్ ఫెడ్…
తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి స్వయంగా 12 మంది రైతుల తోటలను పరిశీలించి, ‘జన్యు లోపం ఉన్న మొక్కలు నిజమేన’ని అంగీకరించినట్లు రైతులు చెబుతున్నారు. అయితే కోఆపరేటివ్, తెలంగాణ ఆయిల్ పామ్, వినియోగదారుల చట్టాల్లో నష్టపరిహారం ఇచ్చే నిబంధనలు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘కాయని మొక్కలను పీకి, కొత్తవి వేయండి’ అన్న ఆయన సూచన రైతులకు ఆగ్రహం తెప్పించింది. 30 సంవత్సరాల ఆదాయం కోసం కష్టపడి పెట్టిన మొక్కలు 6-7 సంవత్సరాల తర్వాత కాయకపోతే, మళ్లీ కొత్త మొక్కలు వేయడం రైతులకు మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. కొత్తగా వేసిన మొక్కలు కూడా 4 సంవత్సరాల తర్వాత కాయకపోతే రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *