- రొమ్ము క్యాన్సర్ అవగాహనకు అడుగులు!
- డాక్టర్ రఘురామ్ అకుంఠిత సేవకు ప్రశంస
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశంలో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సాదర స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, ‘డాక్టర్ రఘురామ్ చేపట్టిన ప్రతి పని 100% విజయాల రేటుతో చేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆయన్ను నేను దగ్గరగా చూస్తున్నాను. మాతృప్రేమ, మాతృభూమి పట్ల ప్రేమ అతనిని యుకే నుంచి భారత్కు తిరిగి తీసుకొచ్చింది. ఆయన అనేక ఆవిష్కరణాత్మక కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ చికిత్స తీరును సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలకు మరిన్ని విజయాలు దక్కుతాయ’ని ఆకాంక్షించారు.
జూలియా మోర్బీ ప్రశంసలు…
మిస్ వరల్డ్ 2025 బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్బీ నేతృత్వం వహించారు. గత 18 సంవత్సరాలలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను ఆమె కొనియాడారు. అక్కడకు హాజరైన పలువురు వైద్యనిపుణులను ఉద్దేశించి మిస్ జూలియా మోర్బీ మాట్లాడుతూ, ‘డాక్టర్ రఘురామ్ హైదరాబాద్లో దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా తన సొంత ఆలోచనలతో రూపొందించిన ఈ అసాధారణ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా అద్భుతమైన నాయకత్వ పటిమను చాటార’ని తెలిపారు.
మిస్ వరల్డ్ పోటీదారుల కామెంట్స్…
దేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రచారంపై నందిని గుప్తా (మిస్ ఇండియా 2025), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్ 2025), ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్-మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర్ ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025-ఫ్రాన్స్), డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యు.ఎస్.ఎ.) తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు. తన తల్లి డాక్టర్ ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ప్రయాణంతో స్ఫూర్తి పొందిన ఆయన… ఇలా దేశంలో చాలామందికి అవసరమైన రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తమ తమ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహనకు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.

డాక్టర్ రఘురామ్ అద్భుతంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నామని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అమలు చేసిన ప్రయత్నాలను తమ స్వదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సదర్భంగా కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, ‘కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులందరికీ, మిస్ జూలియా మోర్లీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.