’23’: తెరపై దళిత గాథ!

  • చిలకలూరిపేట విషాదం వెనుక దాగి ఉన్న మానవత్వం!
  • దేశంలోని జైళ్లలో ఎక్కువ మంది దళితులు, పేదవాళ్లే

వెండితెరపై కదులుతున్న దృశ్యం కేవలం సినిమా కాదు… అది కాలం చేసిన గాయం! ’23’ అనే అంకె… 1993లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహన ఘటనలో అసువులు బాసిన 23 మంది అమాయకుల ఆర్తనాదం! జీఆర్ మహర్షి అందించిన కథతో దర్శకుడు రాజ్ ఆర్ రూపొందించిన ఈ చిత్రం… ఆనాటి విషాదాన్ని, నేటి సమాజంలోని అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలి… కానీ, సమాజంలో అందరికీ న్యాయం అందుతోందా? కులం, డబ్బు బలంతో కొందరు తప్పించుకుంటే… నిస్సహాయులు కారాగారాల్లో మగ్గుతున్న ఈ చీకటి కోణాన్ని ’23’ తీవ్రంగా ప్రశ్నిస్తోంది.

విషాదంలో చిక్కుకున్న ప్రేమ కథ!
సాగర్ (తేజ)… ఒక మారుమూల పల్లెటూరి యువకుడు. తనకంటూ ఒక చిన్న ఇడ్లీ బండి వేసుకొని గౌరవంగా బతకాలని కలలు కంటాడు. కానీ బ్యాంకుల తలుపులు అతని ఆశలకు అడ్డుగా నిలుస్తాయి. పొగాకు కార్మికురాలు సుశీల (తన్మయి)ని ప్రేమిస్తాడు. వారి మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురిస్తుంది. కానీ పేదరికం వారి ప్రేమకు శాపంగా మారుతుంది. పెళ్లి కాకుండానే సుశీల గర్భవతి అవుతుంది. ఆమెకు మంచి జీవితం ఇవ్వాలంటే డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి సాగర్‌ను ఒక ప్రమాదకరమైన నిర్ణయానికి పురిగొల్పుతుంది. అతని స్నేహితుడు దాస్… పోలీసుల దృష్టిలో నేరస్తుడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో దాస్‌తో కలిసి బస్సు దోపిడీకి పథకం వేస్తాడు సాగర్. పెట్రోల్ పోసి ప్రయాణికులను భయపెట్టాలని చూస్తారు. కానీ విధి మరో విధంగా వారిని పరీక్షించింది. ప్రయాణికులు ప్రతిఘటిస్తారు. తప్పించుకునే ప్రయత్నంలో సాగర్ వెలిగించిన అగ్గిపుల్ల అనుకోకుండా బస్సును మంటల్లోకి నెడుతుంది. క్షణాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోతారు. సాగర్, దాస్‌లు పట్టుబడతారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తుంది.

న్యాయం అందరికీ సమానమేనా?
నేరస్తులకు శిక్ష పడటమే నిజమైన న్యాయమైతే… ఉరితీయబడిన వారందరూ హంతకులేనా? దర్శకుడు రాజ్ ఆర్ ఈ ప్రశ్నను సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సంధిస్తారు. 1991లో జరిగిన చుండూరు దళిత మారణకాండలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 1997లో జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు బాంబు పేలుడులో 26 మంది మరణించారు. ఈ రెండు ఘటనల్లోనూ ప్రాణాలు తీయడమే లక్ష్యం. కానీ ఆ కేసుల్లోని నిందితులకు ఉరిశిక్ష కాదు కదా, జీవిత ఖైదు కూడా పడలేదు. చుండూరు కేసులో జైలు శిక్ష అనుభవించిన వారు సైతం విడుదలయ్యారు. మరి కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో జరిగిన చిలకలూరిపేట దుర్ఘటనలో నిందితులకు ఉరిశిక్ష ఎందుకు? చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందా? ఈ ప్రశ్నతో దర్శకుడు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తారు.

ద్వితీయార్థంలో కన్నీటిని ఆపుకోలేని క్షణాలు!
సినిమా ద్వితీయార్థంలో కథనం ఖైదీల మానసిక పరివర్తన వైపు తిరుగుతుంది. కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. క్లైమాక్స్‌లో క్షమాభిక్ష లభిస్తుంది. కానీ దర్శకుడు చెప్పాలనుకున్న అసలైన విషయం మాత్రం ప్రేక్షకుడి మనసులో బలంగా నాటుకుపోతుంది.

నటీనటుల అద్భుత ప్రదర్శన!
’23’ ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదు. దర్శకుడు రాజ్ ఆర్ ఎలాంటి హంగులు లేకుండా సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. మన దేశంలోని జైళ్లలో ఎక్కువ మంది దళితులు, పేదవాళ్లే ఎందుకు మగ్గుతున్నారనే భయానకమైన నిజాని ఈ చిత్రం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇలాంటి కథలకు బలమైన భావోద్వేగాలు ముఖ్యం. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత కొంచెం తక్కువగా అనిపించినా, హీరో ఎలివేషన్లు, పంచ్ డైలాగులు లేని ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఆలోచింపజేసే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ’23’ అలాంటి ఒక ప్రయత్నం. సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. ఇండస్ మార్టిన్ రాసిన సంభాషణలు తరతరాల అణచివేతను తట్టిలేపుతాయి. కులం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అణగారిన వర్గాల ఆవేదన ప్రతిధ్వనిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య అమాయకమైన ప్రేమ సన్నివేశాలు, చివర్లో తండ్రి తన కూతుర్ని రహస్యంగా చూసుకునే సన్నివేశం గుండెను పిండేస్తుంది. కామెడీ పాత్రల్లో అలరించే తాగుబోతు రమేష్ ఈ సినిమాలో తనలోని సీరియస్ నటుడిని పరిచయం చేశాడు. వినోదం పంచే సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఆలోచనలు రేకెత్తించే సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తాయి. ’23’ అలాంటి ఒక అరుదైన ప్రయత్నం. తప్పకుండా చూడాల్సిన చిత్రం!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *