- సమగ్ర విచారణ జరపాలని రైతుల యోచన
- కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం?
- నాణ్యతలేని మొక్కలను నాశనం చేయాలి
- ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ డిమాండ్
సహనం వందే, హైదరాబాద్:
ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల పట్ల ఇంత ఉదాసీన వైఖరి ఎందుకు? సీబీఐ విచారణ వేస్తే తేలుస్తారు కదా? ఒకసారి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసే విషయాన్ని పరిశీలిస్తున్నామని’ ఆయిల్ పామ్ రైతు ఒకరు తెలిపారు. 2015-22 సంవత్సరాల మధ్య పనిచేసిన కాంట్రాక్టర్, అధికారులపైన విచారణ చేసి బాధ్యులను ఆయిల్ ఫెడ్ నుండి తొలగించి… నష్టాన్ని వారి నుండి రికవరీ చేయాలని కోరుతున్నారు.
నాణ్యతలేని మొక్కలను నాశనం చేయాలి…
ప్రస్తుతం నర్సరీలలో ఉన్న రెండు మూడేళ్ల వయస్సు గల నాణ్యత లేని మొక్కలన్నింటినీ వెంటనే నాశనం చేయాలని అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా నర్సరీ నిర్వహణ బాధ్యతల నుండి ప్రైవేట్ కాంట్రాక్టర్లను తొలగించి ఆయిల్ ఫెడ్ నేరుగా నర్సరీని నిర్వహిస్తేనే రైతులు ముందుకు వస్తారని, లేకపోతే ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకోవడం కష్టమని సొసైటీ తేల్చి చెప్పింది. ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నాణ్యత లేని మొక్కలతో దిగుబడిపై ప్రభావం…
ప్రస్తుతం ఆయిల్ పామ్ తోటలలో చాలా వరకు కర్లింగ్, నాణ్యత లేని ఇతర రకాల మొక్కలు ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి కేవలం 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటున్న రైతులు సైతం ప్రస్తుతం ఉన్న నర్సరీల నుండి మొక్కలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న నాణ్యత లేని తోటలను తొలగించి కొత్త మొక్కలు నాటాలని భావిస్తున్న రైతులు కూడా పాత నర్సరీల మొక్కలపై నమ్మకం కోల్పోయారు.
కొత్త నర్సరీలే శరణ్యం…
ఈ క్లిష్ట పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాలతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొత్త నర్సరీలను ఏర్పాటు చేయడమే సరైన పరిష్కారమని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. అలా చేయకపోతే ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలు నెరవేరవని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే కొత్త నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సొసైటీ నాయకులు డివిజనల్ అధికారిని కోరారు. గతంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే రైతులు ఆయిల్ ఫెడ్ పై విశ్వాసం కోల్పోయారని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమామహేశ్వర రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య శనివారం ఖమ్మం డివిజనల్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.