సమన్వయ లోపం.. కార్యక్రమం ఆలస్యం
సహనం వందే, హైదరాబాద్:
ఫిలిం సిటీలో అందాల బామల పర్యటన కార్యక్రమం ఆలస్యంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సుందరీమణుల ప్రోగ్రాంలు సమయనుకూలంగా జరుగుతుండగా.. ఫిలిం సిటీ శనివారం నాటి కార్యక్రమం మాత్రం ఆలస్యంగా జరిగింది. వాస్తవానికి ఫిలిం సిటీకి సమయం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే అందాల తారాలంతా చేరుకున్నప్పటికి అక్కడి సిబ్బంది, అధికారులు, పోలీసుల మధ్యన సమన్వయ లోపంతో కార్యక్రమ నిర్వహణలో ఆలస్యం చోటు చేసుకుందని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా రాత్రి 7.30 గంటలకు విందుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ… గంట ఆలస్యంగా విందు దగ్గరకు వెళ్లారు. ప్రోగ్రాం ఆలస్యం అవడంతో సుందరిమణులు బస చేసే హోటల్ కు కూడా ఆలస్యంగానే వెళ్లాల్సి వచ్చింది. ఆలస్యంతో అధికారులంతా టెన్షన్ పడ్డారు.
మీడియాపై పోలీసుల అత్యుత్సాహం…
రామోజీ ఫిలిం సిటీలో మిస్ వరల్డ్ పోటీ దారుల సందర్శన కార్యక్రమంలో డ్యూటీలో ఉన్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాస్తవానికి ప్రోగ్రాం కవరేజి కోసం సమాచార శాఖ అధికారులు వివిధ పత్రికలకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రతినిధులను తీసుకెళ్లారు. అందుకోసం ముందుగానే ప్రతినిధుల పేర్ల వారీగా పాసులు మంజూరు చేశారు. కానీ పోలీసులు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి సమాచార శాఖ జాయింట్ డైరక్టర్ చెప్పినా వినకపోవడం గమనార్హం. మీడియాను కో ఆర్డినేట్ చేయడానికి ఫిలిం సిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బృందం కూడా పట్టించుకోలేదు. దాంతో పోలీసులకు, మీడియా ప్రతినిధులకు మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది.