- మామకు వెన్నుపోటుకు వెనుకాడని తన్నీరు
- కల్వకుంట్ల కుటుంబంలో హరీష్ రావు చిచ్చు?
- కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించని వైనం
- బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట…!
- కేసీఆర్, కేటీఆర్ ఒకవైపు… హరీష్ మరోవైపు
- వారందరికీ దూరంగా కవిత దారి మరోవైపు
- అగ్గి రాజేస్తున్న కాంగ్రెస్… కవితకు సపోర్ట్
- హరీష్ రావు, కవితలపై కమలం పార్టీ వల
సహనం వందే, హైదరాబాద్:
రాజకీయ ఓనమాలు నేర్పించి ఈ స్థాయికి తీసుకొస్తే, తన సొంత మేనమామ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు కూడా హరీష్ రావు వెనుకాడడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ చీలికకు ఆయన బీజం వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేనట్టు చెబుతున్నారు. కేటీఆర్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తన రాజకీయ అడుగులు మరోరకంగా ఉంటాయని హరీష్ రావు తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత కూడా తన తండ్రికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఆమె తన తండ్రికి అసంతృప్తితో కూడిన 6 పేజీల లేఖ రాసినట్లు సమాచారం. ఇలా బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేసీఆర్, కేటీఆర్ ఒక గ్రూప్ కాగా… హరీష్ రావు, కవిత వేరు వేరు గ్రూపులుగా విడిపోయారు.
ఉద్యమ పార్టీకి పగుళ్లు…
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు బలమైన శక్తిగా వెలుగొందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇప్పుడు అంతర్గత విభేదాలతో కుదేలవుతోంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ఒకప్పుడు ఐకమత్యంతో ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిన ఈ పార్టీ, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలోని విభేదాలతో మూడు ముక్కలుగా చీలిపోయే ప్రమాదంలో ఉంది. కేటీఆర్, కవిత, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు… పార్టీలో అసంతృప్తి… కాంగ్రెస్, బీజేపీల రాజకీయ వ్యూహాలు బీఆర్ఎస్ను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ఈ అంతర్గత కలహాలు పార్టీ క్యాడర్లో అయోమయాన్ని, నిరాశను సృష్టిస్తున్నాయి. ఇటీవల వరంగల్లో జరిగిన పార్టీ రజతోత్సవ సభలో హరీష్ రావును పక్కన పెట్టడం, కేటీఆర్కు ప్రాధాన్యత ఇవ్వడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.
హరీష్ రావు అత్యాశ…
హరీష్ రావు… బీఆర్ఎస్లో కీలక నేతగా, తెలంగాణ ఉద్యమంలో సమర్థవంతమైన పాత్ర పోషించారు. అయినప్పటికీ కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించడంపై ఆయన గత కొన్నేళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తన ప్రాధాన్యం తగ్గుతున్న దృష్ట్యా హరీష్ రావు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏ పార్టీకైనా ఇద్దరు రథసారధులు ఉండరు. బలమైన నాయకుడి నేతృత్వంలో అందరూ పనిచేయాల్సిందే. అందునా ప్రాంతీయ పార్టీలలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. వారసులే పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపడతారు. ఎవరికి ఇష్టమైనా కష్టమైనా దీన్ని అంగీకరించాల్సిందే. కానీ హరీష్ రావు మాత్రం అంగీకరించడం లేదు. ఆయనకు అత్యాశ ఎక్కువ. ఎలాగైనా పార్టీని సొంతం చేసుకోవాలని… భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆయన కలలు కంటారని సన్నిహితులు చెబుతుంటారు. గతంలో అనేకసార్లు ఇతర పార్టీలతో అంతర్గత రహస్య సంబంధాలు ఏర్పరచుకున్న ఆయన… ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లో పెట్టాలంటే ఎవరు ఒప్పుకుంటారు? మేనమామ ఆదేశాలను కూడా ఆయన దిక్కరిస్తారా? ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో ఆయన తన మామకు వ్యతిరేకంగా అనేక చర్యలు చేపట్టలేదా? అన్న విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి వ్యక్తిని పార్టీకి అధినేతగా ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు అప్పుడు ఉన్నట్లుగా హరీష్ రావు వ్యవహార శైలి ఇప్పుడు లేదని అనేకమంది విమర్శిస్తుంటారు. అందువల్ల అత్యాశకు పోవడం హరీష్ రావుకు తగదని పలువురు రాజకీయ పండితులు హితబోధ చేస్తున్నారు. పార్టీని నడిపించే సత్తా ఆయనకు లేదని, కేవలం హడావుడి మాత్రమే చేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తండ్రికి వ్యతిరేకంగా కూతురు…
పార్టీలో తనపై దుష్ప్రచారం, కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తాన’ని ఆమె మీడియాతో అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను పనిగట్టుకొని ఓడించారని, ఈ విషయంపై తండ్రి కేసీఆర్కు ఆమె ఆరు పేజీల లేఖ రాసినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనను జైలులో పడేస్తే కనీసం తన తండ్రి ఒక్కసారి కూడా పరామర్శించడానికి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతో కవిత బీసీ వాదాన్ని ఎత్తుకోవడం, సామాజిక తెలంగాణ లక్ష్యం ఇంకా సాధించలేదని వ్యాఖ్యానించడం ఆమె కొత్త రాజకీయ మార్గం వైపు అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇలా తండ్రికి వ్యతిరేకంగా కూతురు రాజకీయంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ మౌనం…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా నిరాశలో ఉండిపోయారు. ఎర్రవెల్లి ఫాంహౌస్కు పరిమితమై పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం క్యాడర్లో నిరాశను కలిగించింది. కుటుంబంలోని విభేదాలను సమన్వయం చేయడంలో కేసీఆర్ విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ను పార్టీ వారసుడిగా ప్రకటించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే హరీష్, కవితలు వ్యతిరేకిస్తుండడంతో కేసీఆర్ చిక్కుల్లో పడ్డారు. మరోవైపు ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు కావడం, అరెస్టు అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెప్పడం పార్టీకి మరో దెబ్బగా మారింది.
కాంగ్రెస్, కమలం ఎదురుచూపు…
బీఆర్ఎస్లోని అంతర్గత విభేదాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కవిత వర్గాన్ని ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు గాంధీభవన్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంక్షోభాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే బీఆర్ఎస్ బలహీనతను సద్వినియోగం చేసుకోవాలని కమలం పార్టీ లెక్కలు వేస్తోంది. హరీష్ రావు లేదా కవితలలో ఎవరో ఒకరిని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.