సోషల్ మీడియాలో పోస్ట్… తొలగింపు
సహనం వందే, న్యూఢిల్లీ:
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురువారం రాత్రి హఠాత్తుగా మాయమైంది. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఫోన్ కాల్ తర్వాతే ఆమె ఈ పోస్ట్ను తొలగించినట్లు తెలుస్తోంది. ట్రంప్పై కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించడంతో, నడ్డా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కంగనా పోస్ట్లో ఏముంది?
కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్కు సంబంధించిన ఒక వివాదాస్పద వ్యాఖ్యను పోస్ట్ చేశారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ను భారత్లో ఐఫోన్ల తయారీని నిలిపివేయాలని ట్రంప్ కోరిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ట్రంప్ను భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. మోదీతో పోల్చడం ద్వారా ట్రంప్ను తక్కువగా చూపించేలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
బీజేపీలో అంతర్గత చర్చ…
ఈ సంఘటన బీజేపీలో అంతర్గత క్రమశిక్షణ, సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ గురించి చర్చను రేకెత్తించింది. కంగనా గతంలో కూడా తన వివాదాస్పద పోస్ట్లతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆమెను మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని పార్టీ వర్గాలు హెచ్చరించాయి.