ప్రజారోగ్యంలో ఖల్ ‘నాయక్’

  • విజిలెన్స్ విచారణలో వెలుగులోకి డీహెచ్ అక్రమాలు
  • రవీందర్ నాయక్ ను వెనకేసుకొస్తున్నదెవరు?
  • వైద్య ఆరోగ్య మంత్రి దామోదర నరసింహ పేషీ మద్దతు?

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా కొందరు అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్‌పై విజిలెన్స్ విచారణలో అక్రమాలు బట్టబయలైనా, ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. నోటీసులు ఇచ్చినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలల కిందట ఆయన్ను తప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం హఠాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గిందని నిలదీస్తున్నారు. బదిలీల పేరుతో అధికారులు కోట్లు కొల్లగొడుతున్నా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. రవీందర్ నాయక్‌ను కాపాడుతున్న ఆ పెద్దలు ఎవరు?

బదిలీల దందాలో కోట్లు…
డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) కార్యాలయం గత ఏడాది జూలైలో బదిలీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు వచ్చాయి. స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది బదిలీ జాబితాలలో అడ్డగోలుగా మార్పులు జరిగాయి. రాత్రికి ఒక లిస్టు, ఉదయానికి ఇంకో లిస్టు. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట వేసిన నర్సులు మళ్లీ అక్కడే తిష్ట వేయడానికి లక్షలు చేతులు మారాయి. విజిలెన్స్ విచారణలో ఈ విషయం స్పష్టంగా తేలింది. ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు నర్సులు బదిలీల కోసం ఉన్నతాధికారులకు డబ్బులు ముట్టజెప్పారు. యూనియన్ల పేరు చెప్పి డబ్బు దండుకున్నారు. యూనియన్‌లో లేనివాళ్లు కూడా బదిలీ నుంచి తప్పించుకున్నారు. ఈ అక్రమాలపై నర్సింగ్ ఆఫీసర్లు అర్ధరాత్రి రోడ్ల మీద ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ కోట్ల రూపాయల దందాలో రవీందర్ నాయక్ పాత్రపై అనుమానాలు నెలకొన్నాయి.

చెత్త కుప్పలో విజిలెన్స్ రిపోర్టులు…
రవీందర్ నాయక్‌పై విజిలెన్స్, ఇంటెలిజెన్స్ రిపోర్టులు స్పష్టమైన ఆధారాలతో అక్రమాలను బయటపెట్టాయి. చార్జి మెమో ఇచ్చినా ఇంకా ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? ఆరు నెలల క్రితం మంత్రి దామోదర రాజనర్సింహ ఆయన్ను తీసేయాలని ప్రయత్నించినా, ఉన్నట్టుండి ఎందుకు వెనక్కి తగ్గారు? దీని వెనుక ఎవరున్నారు? రాజకీయ ఒత్తిడులా? లేక పెద్దలకు ముడుపులు ముట్టాయా? ఉన్నతాధికారులు రవీందర్ పనితీరుతో విసిగిపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? విజిలెన్స్ రిపోర్టులు కేవలం కాగితాలకే పరిమితమై, చివరికి వాటిని చెత్తబుట్టలో పడేశారన్న విమర్శలు ఉన్నాయి.

మంత్రి దామోదర మౌనం…
బదిలీల్లో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఏడుగురు అధికారులకు చార్జి మెమోలు కూడా ఇచ్చారు. కానీ రవీందర్ నాయక్ విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు? మంత్రి మాటలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికా? అవినీతి ముందు ప్రభుత్వం చేతులెత్తేసిందా? విచిత్రం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం పూర్తిగా రవీందర్ నాయక్ కు మద్దతుగా నిలుస్తుండటం సందేహాలు తావిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *