- ముంబైలో పిజ్జా డెలివరీ బాయ్ కి చేదు అనుభవం
- హిందీ భాషపై మహారాష్ట్రలో కొనసాగుతున్న వ్యతిరేకత
సహనం వందే, ముంబై:
ముంబైలోని భాండుప్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన భాషా అభిమానానికి అద్దం పడుతోంది. సాయి రాధే అపార్ట్మెంట్లో ఒక జంట, తమ ఇంటికి పిజ్జా డెలివరీ చేసిన వ్యక్తి మరాఠీ మాట్లాడలేదనే కారణంతో డబ్బులు చెల్లించడానికి నిరాకరించారు. హిందీ మాట్లాడకూడదని వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘నీకు మరాఠీ రాదు.. డబ్బులు ఇవ్వం!’
డొమినోస్ డెలివరీ ఏజెంట్ రోహిత్ లవారే పిజ్జా ఆర్డర్తో వెళ్లినప్పుడు, ఆ జంట అతనితో వాగ్వాదానికి దిగింది. వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నట్లుగా, ఆ మహిళ ‘నువ్వు మరాఠీలో మాట్లాడితేనే మేము పిజ్జా తీసుకుంటాం, అప్పుడే డబ్బులు ఇస్తామ’ని పట్టుబట్టింది. మరాఠీ రాని రోహిత్ ఆశ్చర్యంగా ‘నాకు మరాఠీ రాదు, ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. అయితే ఆ మహిళ తన మొండి పట్టుదలను వీడలేదు. ‘ఇక్కడ ఇలాగే ఉంటుంది’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. రోహిత్ ఎంత నచ్చజెప్పినా వినకుండా, తమ భాషలోనే మాట్లాడాలని పట్టుబట్టింది. విసిగిపోయిన రోహిత్ ‘ఎవరు చెప్పారు ఇలా ఉంటుందని?’ అని నిలదీయగా, ఆమె మరింత దురుసుగా ప్రవర్తించింది.
వీడియో తీయడంతో బెదిరింపులు
రోహిత్ ఈ సంభాషణను తన ఫోన్లో రికార్డ్ చేస్తుండగా, అది గమనించిన ఆ మహిళ మరింత ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నువ్వు నా వీడియో తీయకూడదు’ అంటూ బెదిరించింది. చేసేది లేక రోహిత్ డబ్బులు తీసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. భాష పేరుతో ఒక డెలివరీ ఏజెంట్ను వేధించడం దారుణమని, ఇది భాషా దురహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది ప్రాంతీయ విద్వేషాన్ని ప్రేరేపించే చర్యగా అభివర్ణిస్తున్నారు. మహారాష్ట్రలో భాషాభిమానంపై కొనసాగుతున్న ఉద్యమంగా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.