- గత ప్రభుత్వపు మత్తులోనే అధికారులు
- కోవర్ట్ అవతారం… చెడ్డపేరు తెచ్చేలా కృషి
- వ్యూహాత్మకంగా పథకాల అమలులో వైఫల్యం
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలుతీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుండటం వెనుక వ్యవసాయశాఖలోని ఒకరిద్దరి హస్తం ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పథకాల రూపకల్పన నుంచి అమలు వరకు జరుగుతున్న తప్పిదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో కొందరు కావాలనే చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అసమర్థతనా? కుట్రనా?
గత ప్రభుత్వం రుణమాఫీని విడతల వారీగా అమలు చేసినప్పటికీ, రైతుబంధు పథకం ద్వారా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చగలిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. సరైన మార్గదర్శకాలు లేకపోవడం, పంపిణీలో తీవ్ర జాప్యం వంటి కారణాల వల్ల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వైఫల్యాల వెనుక ఒకరిద్దరు అధికారులు కావాలనే కుట్ర పన్నుతున్నారని, ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉంటూ గత ప్రభుత్వంలోని నాయకులకు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాల అమలులో జరుగుతున్న దారుణమైన వైఫల్యాలు కేవలం అసమర్థత కాదని, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న మోసమని కొందరు కాంగ్రెస్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా ఈ కుట్రదారులపై ఉక్కుపాదం మోపకపోతే రైతుల్లో ఆగ్రహ జ్వాలలు మరింత పెరుగుతాయని అంటున్నారు.
రైతుల నోట్లో మట్టి కొడుతున్న కోవర్టులు!
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రూ. 54 వేల కోట్లు ఖర్చు చేసింది. రూ. 21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున సాయం చేసింది. అయితే ఈ పథకాల అమలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రుణమాఫీలో రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న కొందరు రైతులకు కూడా లబ్ధి జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో వివరాలు తప్పుగా ఉండటం వంటి కారణాలతో రైతులు నష్టపోతున్నారు. కొర్రీలతో కూడిన మార్గదర్శకాలు తయారుచేసి రైతుల్లో అసంతృప్తి కలిగేలా కోవర్టులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా కుట్ర…
ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతోనే అందరికీ లబ్ధి జరిగేలా చేయడం యంత్రాంగం బాధ్యత. ఇలా చేయాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. లేకుంటే అపజయమే మిగులుతుంది. వ్యవసాయశాఖలో కోవర్ట్ అధికారులు వ్యూహం లేకుండా వ్యవహరించారు. గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ, రుణమాఫీలోని లోపాలను వ్యూహాత్మకంగా కప్పిపుచ్చింది. ఐదేళ్లలో విడతల వారీగా రుణమాఫీ చేసినప్పటికీ, రైతుబంధు ద్వారా రైతులకు నిరంతర సాయం అందించడం అనే వ్యూహాన్ని అమలు చేయడం వల్ల వ్యతిరేకతను తగ్గించగలిగారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కోవర్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రభుత్వంపై రైతుల్లో అసంతృప్తిని రగిలించారు.
గత ప్రభుత్వపు మత్తులోనే కోవర్టులు…
వ్యవసాయ శాఖలో తిష్ట వేసిన కొందరు పెద్ద తలకాయలు ఇంకా గత ప్రభుత్వపు మత్తులోనే ఉన్నారు. వారే ఇప్పుడు కోవర్టులుగా మారి, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. వారే ఈ పథకాల అమలులో కావాలనే జాప్యం చేస్తున్నారని, తప్పుడు సలహాలు ఇస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నీరుగార్చేందుకు, ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచేందుకు వారు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ‘గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన కొందరు అధికారులు, ఇప్పటి ప్రభుత్వాన్ని నమ్మించి, పథకాలను ఫెయిల్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఇది రాజకీయంగా కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్ర’ అని విశ్లేషకులు అంటున్నారు.