- మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఘాటు వ్యాఖ్యలు
- పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్లలేదంటూ వస్తున్న కామెంట్లపై విమర్శ
- యుద్ధాల యుగం కాదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యల ప్రస్తావన
సహనం వందే, పూణే:
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తీవ్రంగా ఖండించారు. యుద్ధం అనేది బాలీవుడ్ సినిమాలో చూపించే రొమాంటిక్ అంశం కాదని, అది అత్యంత గంభీరమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు…
యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు. అది మీ బాలీవుడ్ సినిమా కాదు. ఇది చాలా సీరియస్ వ్యవహారం. యుద్ధం లేదా హింస ఎల్లప్పుడూ చివరి ప్రయత్నంగా ఉండాలి. మన ప్రధాని కూడా ఇది యుద్ధాల యుగం కాదని చెప్పారు. కొందరు తెలివిలేని వారు యుద్ధాన్ని మనపై రుద్దినా, మనం దానిని సమర్థించకూడదు అని నరవణే అన్నారు.
సరిహద్దు ప్రజల కష్టాలు…
సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా పిల్లలు కాల్పుల వల్ల ఎదుర్కొనే కష్టాలను ఆయన వివరించారు. రాత్రిపూట కాల్పులు జరిగినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని షెల్టర్లకు పరుగులు తీయాల్సిన దుర్భర పరిస్థితి ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధ తరతరాలుగా వెంటాడుతుందని, యుద్ధంలో భయానక దృశ్యాలు చూసిన వారు 20 ఏళ్ల తర్వాత కూడా నిద్రలో ఉలిక్కిపడి లేస్తారని, వారికి మానసిక చికిత్స అవసరమవుతుందని ఆయన తెలిపారు.
పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లలేదంటూ…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మన దేశం ఆపరేషన్ సిందూర్ను చేపట్టి, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏడు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్రమైన ఒక స్థాయి యుద్ధం జరిగింది. అయితే శనివారం ఇరు దేశాలు అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయి. అయితే కొందరు మాత్రం కొందరు ఇంకా ఎందుకు పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. సైనికుడిగా నాకు ఆదేశిస్తే యుద్ధానికి వెళ్తాను, కానీ అది నా మొదటి ఎంపిక కాదు. నా మొదటి ఎంపిక ఎల్లప్పుడూ దౌత్యపరమైన చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడం అని నరవణే తేల్చిచెప్పారు.
హింస సమాధానం కాదు…
జాతీయ భద్రతలో మనమందరం సమాన భాగస్వాములం. దేశాల మధ్య మాత్రమే కాకుండా కుటుంబాలలో, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, సమాజాల మధ్య కూడా విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. హింస ఎప్పటికీ సమాధానం కాదని ఆయన గట్టిగా చెప్పారు. రక్షణ బడ్జెట్ ప్రాముఖ్యతను కూడా నరవణే నొక్కి చెప్పారు. బడ్జెట్లో దాదాపు 15 శాతం రక్షణ మంత్రిత్వశాఖకు కేటాయించారు. ఇది ఒక రకమైన బీమా ప్రీమియం లాంటిదని నరవణే అన్నారు.