- కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
- మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం వెనక్కి
- కొద్ది గంటల్లోనే మాట తప్పిన పాకిస్తాన్
- ఖండించిన భారత్… సైన్యం అప్రమత్తం
- డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వానికి విలువేది?
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం ఉల్లంఘన
విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం మధ్యాహ్నం 3:35 గంటలకు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరమణకు అంగీకరించారు. సాయంత్రం 5 గంటల నుంచి భూమి, ఆకాశం, సముద్రంలో అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరువైపులా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన మాటను ఉల్లంఘించింది.
జమ్మూ కాశ్మీర్లో కాల్పులు…
పాకిస్తాన్ గత మూడు గంటలుగా నిరంతరంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు చోటుచేసుకున్నాయి. అలాగే పీర్ పంజల్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్ కార్యకలాపాలు కూడా నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనలను భారత సైన్యం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది.
సరిహద్దుల్లో అప్రమత్తమైన భారత సైన్యం…
పాకిస్తాన్ యొక్క ఈ చర్యలకు భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఏవైనా ఉల్లంఘనలను గట్టిగా తిప్పికొట్టేందుకు సైన్యానికి కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ తన ఉల్లంఘనలను వెంటనే నిలిపివేయాలని, పరిస్థితిని బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆయన హెచ్చరించారు.
శ్రీనగర్, ఉదమ్పూర్లలో పేలుళ్లు…
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన కొద్ది గంటల్లోనే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, ఉదమ్పూర్లలో భారీ పేలుళ్లు సంభవించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. శ్రీనగర్లో వినిపించిన పేలుళ్లపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా మధ్యవర్తిత్వంపై భిన్న కథనాలు…
ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని ఖండించాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని, ఎటువంటి షరతులు లేకుండానే కుదిరిందని భారత వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, పాకిస్తాన్ యొక్క ఈ ఉల్లంఘనలు వెంటనే ఆగి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా జరిగిన డ్రోన్, క్షిపణి దాడులు ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి.