‘అందం’పై యుద్ధమేఘం

  • దేశం విషాదంలో ఉంటే అందాల వేడుకలా?
  • మిస్ వరల్డ్ 2025 నిర్వహణ సమంజసమా?
  • హైదరాబాదులో నిర్వాణపై విమర్శల వెల్లువ
  • దేశంలో 27 విమానాశ్రయాలు మూసివేత
  • ఎక్కడికక్కడ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు
  • హైదరాబాదుకు ఉగ్రదాడుల నెత్తుటి చరిత్ర
  • ఈ పరిస్థితుల్లో అందగత్తెలకు భద్రత కష్టం
  • ఏమైనా జరిగితే అంతర్జాతీయ విమర్శలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పాకిస్తాన్ పై జరుగుతున్న యుద్ధం కారణంగా ఉత్తరాదిలో దాదాపు 27 విమానాశ్రయాలు మూసివేశారు. 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీలను నిర్వహించడం సమంజసం కాదని అంటున్నారు.

అందాల రాణుల రాకపై సంక్లిష్టత…
హైదరాబాద్‌లో ఈనెల 10వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. పోటీల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. 116 దేశాల నుంచి పోటీదారులు రావాల్సి ఉండగా, 88 దేశాల భామలు మాత్రమే చేరుకున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో మిగతా దేశాల నుంచి ఎంతమంది వస్తారన్నది అనుమానమే. అన్ని దేశాల పోటీదారులు రాకుండా పోటీలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చని మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ఉద్రిక్త సమయంలో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించడం దేశ ప్రతిష్టకు సవాల్ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో భద్రతా సవాళ్లు…
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల కోసం గచ్చిబౌలి స్టేడియంలో రిహార్సల్స్ జరుగుతున్నప్పటికీ, భద్రతా ఏర్పాట్లు ప్రధాన సవాలుగా మారాయి. ట్రైడెంట్ హోటల్ వంటి పోటీదారుల బస ప్రాంతాల వద్ద నాలుగు అంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ గతంలో ఉగ్రవాద దాడులకు గురైన చరిత్ర ఉండటం, పాకిస్తాన్ ఇటీవలి దాడుల బెదిరింపులు భద్రతా ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. ‘శత్రుదేశం ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టి ఏమాత్రం గందరగోళం సృష్టిస్తే భారత్ పరువు అంతర్జాతీయ తీవ్రంగా దెబ్బతింటుంద’ని ఒకరు ఎక్స్ పోస్ట్‌లో హెచ్చరించారు. పోటీదారులతో పాటు, విదేశీ మీడియా ప్రతినిధులు, అతిథుల భద్రతను కాపాడడం ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఊహించని భద్రతా సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏంటన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

ఐపీఎల్‌పై కూడా ప్రభావం
ఈ ఉద్రిక్తతలు కేవలం మిస్ వరల్డ్ పోటీలకే పరిమితం కాలేదు. విమానాశ్రయాల మూసివేత, విమానాల రద్దు ఐపీఎల్ మ్యాచ్‌లపై కూడా ప్రభావం చూపాయి. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మే 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ అహ్మదాబాద్‌కు మార్చారు. భద్రతా కారణాలతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అనిల్ పటేల్ తెలిపారు. ఈ పరిణామాలు దేశంలోని అన్ని అంతర్జాతీయ కార్యక్రమాలపై యుద్ధ వాతావరణ తీవ్రతను సూచిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *