అధిక వడ్డీ చూపి వేల కోట్లు దోపిడి

  • రూ. 4,215 కోట్ల ఫాల్కన్ కుంభకోణం
  • దేశ ఆర్థిక చరిత్రలో చీకటి అధ్యాయం
  • నకిలీ హామీలు… భారీ మోసం!
  • డబ్బు మళ్లింపు… విలాసవంతమైన జీవితం!

లక్షలాది మంది అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి సూత్రధారి, ఫాల్కన్ సీఈవో యోగేందర్ సింగ్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా రూ. 4,215 కోట్ల మేర దేశవ్యాప్తంగా పలువురిని నిలువునా ముంచిన ఈ కుంభకోణం దేశ ఆర్థిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది.

చార్టర్డ్ ఫ్లైట్‌లో చిక్కిన మోసగాడు!
దుబాయ్‌కు పారిపోయిన యోగేందర్ సింగ్… ఒక చార్టర్డ్ విమానంలో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడి కదలికలపై నిఘా ఉంచిన సీఐడీ అధికారులు ఎట్టకేలకు అతడిని తమ వలలో బంధించారు. అయితే ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ కుమార్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడు దుబాయ్‌లోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది.

నకిలీ హామీలు… భారీ మోసం!
2021 నుంచి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫాం ఒక పెద్ద పొంజీ స్కీమ్ అని తేలింది. బ్రిటానియా, అమెజాన్, గోద్రెజ్ వంటి పెద్ద కంపెనీలతో ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ద్వారా పెట్టుబడులు పెడితే 11% నుంచి 22% వరకు అధిక రాబడి ఇస్తామని నమ్మబలికారు. కానీ, ఇవన్నీ కేవలం మోసపూరిత మాటలు. ఫాల్కన్ సృష్టించిన వెండర్ ప్రొఫైల్స్, ఒప్పందాలన్నీ కట్టుకథలే. కొత్తగా పెట్టుబడి పెట్టిన వారి డబ్బుతోనే పాతవారికి కొంత మొత్తం చెల్లిస్తూ ఈ స్కీమ్‌ను కొనసాగించారు. దాదాపు రూ. 1,700 కోట్లు వసూలు చేసిన ఫాల్కన్, అందులో రూ. 850 కోట్లు తిరిగి ఇచ్చి, మిగిలిన రూ. 850 కోట్లతో దాదాపు 6,979 మంది పెట్టుబడిదారులను దారుణంగా మోసం చేసింది. అంతేకాదు, అమాయక ప్రజల నుంచి మరో రూ. 792 కోట్లు వసూలు చేసి వారి జీవితాలను ఛిద్రం చేసింది.

డబ్బు మళ్లింపులు…విలాసవంతమైన జీవితం!
ఈ స్కామ్‌లో సేకరించిన భారీ మొత్తాన్ని యోగేందర్ సింగ్, అమర్‌దీప్ కుమార్, ఆర్యన్ సింగ్ (సీఓఓ) వంటి కీలక నిందితులు అనేక షెల్ కంపెనీలకు తరలించారు. ఆ డబ్బుతో క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు గోవాలో ఒక రిసార్ట్, దుబాయ్‌లో ప్రెస్టీజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్ వంటి విలాసవంతమైన వ్యాపారాలు ప్రారంభించారు. అమర్‌దీప్ కుమార్ ఏకంగా 2024లో కోట్ల విలువైన హాకర్ 800ఏ విమానాన్ని కొనుగోలు చేసి, ఈ ఏడాది జనవరి 22న దానిలోనే దుబాయ్‌కి పారిపోయాడు. యోగేందర్ సింగ్ కూడా అతడితో కలిసి చార్టర్డ్ ఫ్లైట్‌లో దుబాయ్ వెళ్లాడు.

బాధితుల ఆగ్రహం!
ఈ ఏడాది జనవరి 15 నాటికి ఫాల్కన్ సంస్థ హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేసి, హైదరాబాద్‌లోని తమ కార్యాలయాన్ని మూసివేసింది. దీంతో ఆగ్రహించిన కొందరు కార్యాలయ ఆస్తులను ధ్వంసం చేయడంతో పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా విచారిస్తోంది. ఈడీ ప్రాథమికంగా ఈ స్కామ్ విలువ రూ. 850 కోట్లుగా అంచనా వేసింది.

పోలీసు చర్యలు!
తెలంగాణ సీఐడీ, సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత ఫిబ్రవరి 15న పవన్ కుమార్ ఓడెలా (వైస్ ప్రెసిడెంట్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రై. లిమిటెడ్), కావ్య నల్లూరి (డైరెక్టర్, ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్)లను అరెస్ట్ చేశారు. ఇప్పుడు యోగేందర్ సింగ్ పట్టుబడటంతో పోలీసులు అమర్‌దీప్ కుమార్, ఆర్యన్ సింగ్‌లను పట్టుకోవడానికి ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటున్నారు. ఈడీ ఇప్పటికే అమర్‌దీప్‌కు చెందిన విమానాన్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్ చేసింది.

అధిక రాబడి ఆశ చూపి…
ఫాల్కన్ స్కామ్ అనేది అధిక రాబడిని ఆశ చూపే ఎలాంటి పథకం అయినా అనుమానించాల్సిందేనని హెచ్చరిస్తోంది. సెబీ, ఆర్‌బీఐ వంటి నియంత్రణ సంస్థలతో ఆ సంస్థ యొక్క చట్టబద్ధతను తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ స్కామ్‌లో డాక్టర్లు, రిటైర్డ్ సైనికులు, సాధారణ ఉద్యోగులు తమ జీవితకాలపు సంపాదనను కోల్పోయారు. ఒక డాక్టర్ ఏకంగా రూ. 5 కోట్లు, ఢిల్లీకి చెందిన నలుగురు రూ. 6 కోట్లు నష్టపోయారు. బెంగళూరులో 183 మంది బాధితులు రూ. 41 కోట్లు కోల్పోయారు. ఈ బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *