- మావోయిస్టులపై ఎన్కౌంటర్లు ఆపాలి
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
సహనం వందే, హైదరాబాద్:
ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదని, పాకిస్తాన్ పాలకులు, ఉగ్రవాదులు కలిసి భారత్లో నరమేధం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనికి సరైన గుణపాఠం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు.
మావోయిస్టులపై ఎన్కౌంటర్లు ఆపాలి…
మావోయిస్టులను ఏరివేసేందుకు ‘ఆపరేషన్ కగార్’ చేపట్టడం సరికాదని, తక్షణమే దీనిని నిలిపివేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామంటే ఒప్పుకోకుండా లొంగిపోవాల్సిందేనని కేంద్ర మంత్రి నియంతలా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూంబింగ్ పేరుతో 22 మందిని ఎన్కౌంటర్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఉద్యోగుల సమ్మె హక్కు…
సమ్మె అనేది ఉద్యోగుల హక్కు అని, సమస్యలు పరిష్కారం కానప్పుడు వారు సమ్మెకు వెళ్లడం సహజమని కూనంనేని అన్నారు. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరపాలని, తద్వారా సగం సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన సూచించారు.