- ప్రభుత్వానికి ఉద్యోగుల ఝలక్
- రేపటి నుంచి ఆర్టీసీలో సమ్మె సైరన్
- వచ్చే నెల 9 తర్వాత ఉద్యోగులంతా నిరసన
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరిగింది! పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 తర్వాత సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు తెగేసి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సమ్మెకు సిద్ధం కావడంతో, రాష్ట్రంలో ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టాయి. ‘ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు’ అంటూ హితవు పలికిన సీఎంకు, ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని హితబోధ చేసిన సీఎంకు, తమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగుల ఐక్య గర్జన… రేవంత్ కు హెచ్చరిక!
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) ఆదివారం భారీ సదస్సు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఉద్యోగులు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉద్యోగులను అశాంతికి గురిచేసిందని, ఆ నిరసనల ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఆశించిన మార్పు కనిపించడం లేదని, ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఆరోపించారు.
సంక్షోభంలో 13 లక్షల కుటుంబాలు…
టీజీఈజేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత 13.31 లక్షల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే, ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఊరుకోం” అని వారు హెచ్చరించారు.
కీలక డిమాండ్లతో ఉద్యోగుల యుద్ధభేరి…
- మధ్యంతర భృతి (ఐఆర్), డీఏ బకాయిలు: గత ఏడాది జులై 1 నుంచి ఇవ్వాల్సిన ఐఆర్, 2023 జనవరి 1 నుంచి పెండింగ్లో ఉన్న నాలుగు డియర్నెస్ అలవెన్సుల (డీఏ)ను వెంటనే విడుదల చేయాలి.
- బిల్లుల క్లియరెన్స్: 2022 నుంచి పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలి. ఈ-కుబేర్ వ్యవస్థను రద్దు చేసి, ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలి.
- తెలంగాణ పీఆర్సీ: ధరల పెరుగుదలకు అనుగుణంగా 51% ఫిట్మెంట్తో రెండో తెలంగాణ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులను అమలు చేయాలి.
- ఆరోగ్య పథకం: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను ప్రభుత్వం, లబ్ధిదారుల సమాన సహకారంతో అమలు చేయాలి.
- హెచ్ఆర్ఏ, రవాణా సౌకర్యాలు: కొంగర కలాన్ వద్ద ఐడీఓసీ రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24% హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) మంజూరు చేయాలి. ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు కల్పించాలి.
- ఉపాధ్యాయుల డిమాండ్లు: స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపక వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు మంజూరు చేయాలి.
- అంగన్వాడీ సమస్యలు: అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. విధుల్లో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
- వికలాంగుల సమస్యలు: వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పెండింగ్లో ఉన్న పీఆర్పీలను అమలు చేయాలి.