- దానికి సాక్ష్యం ఎక్కడ ఉంది
- కాంగ్రెస్ ఎంపీ చన్నీ సంచలన వ్యాఖ్యలు
సహనం వందే, ఢిల్లీ:
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ 2019 సర్జికల్ స్ట్రైక్లపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సర్జికల్ స్ట్రైక్లకు సంబంధించిన సాక్ష్యాలను చూపాలని డిమాండ్ చేయడంతో పాటు, ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించి, చన్నీ సైన్యాన్ని అవమానించారని ఆరోపించింది. ఈ వివాదం రాజకీయ రగడకు దారితీసింది.
సర్జికల్ స్ట్రైక్పై చన్నీ సందేహాలు…
2019లో పుల్వామా దాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్లపై చన్నీ ప్రశ్నలు సంధించారు. ‘సర్జికల్ స్ట్రైక్లు ఎవరూ చూడలేదు. దానికి సాక్ష్యం ఎక్కడ ఉంద’ని ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నిలదీశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ నేతలను ఆగ్రహానికి గురిచేశాయి. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, డీజీఎంఓ అధికారికంగా స్ట్రైక్ల వివరాలను వెల్లడించినప్పటికీ, చన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సైన్యాన్ని కించపరిచే చర్య అని ఆరోపించారు. ఇదిలా ఉండగా… వివాదం తీవ్రతరం కావడంతో చన్నీ తన వ్యాఖ్యలపై స్పష్టీకరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను సైన్యాన్ని గౌరవిస్తాను. కానీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాల’ని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా చన్నీకి మద్దతుగా నిలిచారు. పహల్గామ్ దాడిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. బీజేపీ దీన్ని రాజకీయం చేస్తోంది అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.