జగదీశ్‌గా జాకీర్‌… సావిత్రిగా సబీరా

  • హిందూ మతంలోకి ముస్లిం కుటుంబం
  • మొఘలుల కాలం వరకు హిందువులట
  • అప్పుడు ఒత్తిడితో ఇస్లాంలోకి మారారట
  • ఇప్పుడు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి
  • హిందూ యువ వాహిని సహకారంతో మార్పు
  • కుటుంబ సభ్యుల ముస్లిం పేర్లన్నీ మార్పు
  • ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఘటన

ఉత్తరప్రదేశ్ లో మతమార్పిడి సంఘటన సంచలనంగా మారింది. మొఘలుల కాలంలో తమ పూర్వీకులు హిందువులని… అప్పుడు వారిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లింగా మార్చారని… అందుకే ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి తిరిగి వచ్చామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తాము ముస్లింలం అయినప్పటికీ మనసులో హిందువులు గానే బతుకుతున్నామని కుటుంబ పెద్ద చెప్తున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురా జిల్లా జమునాపార్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యులు హిందూ మతంలోకి మారారు. వృందావన్‌లోని ఒక ఆశ్రమంలో జరిగిన ప్రత్యేక మతపరమైన కార్యక్రమంలో ఈ మార్పిడి జరిగింది. కాషాయ వస్త్రాలు ధరించిన ఈ కుటుంబ సభ్యులు, తమ పూర్వీకులు హిందువులని విశ్వసిస్తూ, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పేర్లు మార్చుకున్న కుటుంబ సభ్యులు…
ఈ కుటుంబానికి పెద్ద అయిన 50 ఏళ్ల జాకిర్‌ను ఇకపై జగదీశ్‌గా పిలుస్తారు. ఆయన మాట్లాడుతూ, ‘మా పూర్వీకులు మొఘల్ కాలం వరకు హిందువులుగానే ఉన్నారు. ఆ సమయంలో ఒత్తిడి కారణంగా వారు ఇస్లాం మతంలోకి మారార’ని తెలిపారు. ‘కానీ నా మనసులో మాటల్లో చేతల్లో నేను ఎల్లప్పుడూ కాళీ మాతను పూజిస్తూనే ఉన్నాను. గ్రామస్తులు నన్ను ఇప్పటికీ భగత్ జీ అని పిలుస్తార’ని ఆయన వెల్లడించారు. ఆయన భార్య గుడ్డి ఇప్పుడు గుడియాగా మారారు. కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా కొత్త హిందూ పేర్లను స్వీకరించారు. పెద్ద కుమారుడు అన్వర్ సుమిత్‌గా, చిన్న కుమారుడు రున్వర్ రమేశ్వర్‌గా, కోడలు సబీరా సావిత్రిగా మారారు. మనవలు సబీర్ శత్రుఘన్‌గా, జోయా సరస్వతిగా, నేహా స్నేహగా కొత్త గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా జరిగిన హవన్-యజ్ఞ కార్యక్రమంలో అర్చకులు వేద మంత్రాలు పఠించగా కుటుంబ సభ్యులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

గుర్జర్ మూలాలు…
షేర్‌గఢ్‌లోని గుర్జర్ సమాజానికి చెందిన జగదీశ్ కొన్నేళ్లుగా తన అత్తగారి ఊరిలో నివసిస్తున్నారు. అక్కడ ఆయన ఒక దుకాణం నడుపుతున్నారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనే ఆలోచన గత మూడు సంవత్సరాలుగా తమ కుటుంబంలో ఉందని ఆయన చెప్పారు. ‘మేము పూర్తి విశ్వాసంతో, ఎటువంటి ఒత్తిడి లేదా ప్రలోభాలకు గురికాకుండా ఈ అడుగు వేశామ’ని ఆయన స్పష్టం చేశారు.

హిందూ యువ వాహిని సహకారంతో…
వృందావన్‌లోని శ్రీ జీ వాటిక కాలనీలోని భగవత్ ధామ్ ఆశ్రమంలో మత మార్పిడి హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన హిందూ యువ వాహిని కార్యకర్త శరద్ సైనీ మాట్లాడుతూ, ఈ కుటుంబం పూర్తిగా స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘పిల్లలు కూడా తమ పూర్వీకుల మతంలోకి తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నార’ని ఆయన అన్నారు.
వృందావన్ కోట్వాలీ ఇన్‌చార్జ్ ప్రశాంత్ కపిల్ ఈ ఘటనపై స్పందిస్తూ, ‘ఈ ప్రక్రియ మొత్తం స్వచ్ఛందంగా, శాంతియుతంగా జరిగింది. ఎటువంటి బలవంతం లేదా ప్రలోభాలు లేవు. కాబట్టి పోలీసు చర్య తీసుకోవాల్సిన అవసరం రాలేద’ని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశం…
ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి నిరోధక చట్టాలు అమల్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యులు, అధికారులు కూడా స్వచ్ఛందంగా జరిగిన మార్పిడి అని స్పష్టం చేశారు. అయితే విమర్శకులు మాత్రం ఒత్తిడి వల్లే మతమార్పిడి జరిగిందని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *