స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?

కేంద్రం కులగణన ప్రకటనతో చిక్కులు

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో తాజా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

కేంద్ర కులగణనకే సాధికారత…
కేంద్ర ప్రభుత్వం జనాభా గణాంకాల సమయంలో కులగణనను చేర్చాలని నిర్ణయించినట్లు ఏప్రిల్ 30న ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించినప్పటికీ, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం నిర్వహించే కులగణన డేటాకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత ఉంటుంది. దీని ఆధారంగానే రిజర్వేషన్ విధానాలు రూపొందిస్తారు. రాష్ట్రం నిర్వహించిన కుల సర్వే ఫలితాలు ఈ విషయంలో చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఫిబ్రవరి 2024లో కుల సర్వే చేపట్టి, దాని ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర సర్వే ఫలితాలు చెల్లవనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

42 శాతం రిజర్వేషన్ అమలు అసాధ్యం…
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం కులగణన డేటా ఆధారంగా రిజర్వేషన్ విధానాలను నిర్ణయించే అవకాశం ఉండటంతో రాష్ట్ర బిల్లు అమలు కష్టసాధ్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిజర్వేషన్ శాతాన్ని తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే చాలా కాలంగా వాయిదా పడుతున్నాయి. కులగణనతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ హామీని అమలు చేయలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం కులగణన పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయడం వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రం నిర్వహించే కులగణన ఫలితాలు వచ్చేందుకు కనీసం ఒకటి లేదా రెండేళ్ల సమయం పట్టవచ్చు. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం తన సర్వే ఆధారంగా రిజర్వేషన్‌ను అమలు చేయాలని పట్టుబట్టినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *