డిగ్రీ పరీక్షలు తక్షణమే నిర్వహించాలి

  • ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్
  • తెలుగు వర్సిటీలో పీహెచ్‌డీల్లో అవకతవకలు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళంపై ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు బలి కాకూడదని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరింది. అలాగే, తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లోని అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

పరీక్షల నిర్వహణపై సందిగ్ధత…
కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారిందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ చివరి నాటికి పూర్తి కావాల్సిన పరీక్షలు ఇంకా నిర్వహించకపోవడం, షెడ్యూల్ కూడా ప్రకటించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై నిర్లక్ష్యం…
ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలకు సహకరించేందుకు నిరాకరిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పేద విద్యార్థులు చదువులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఈ ఐదు విశ్వవిద్యాలయాల పరిధిలో 4.80 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో లక్ష మందికి పైగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పరీక్షలు జరగకపోతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

తెలుగు వర్సిటీలో పీహెచ్‌డీల్లో అవకతవకలు
తెలుగు విశ్వవిద్యాలయంలో ఇటీవల భర్తీ చేసిన పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. అర్హత లేనివారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఫుల్‌టైం పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *