- అస్సాం రైఫిల్స్లో చరిత్ర సృష్టించిన వైనం
- ఇక సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం…
- ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాల్గొనడం
సహనం వందే, అస్సాం:
భారత సైన్యంలోని ప్రతిష్టాత్మక అస్సాం రైఫిల్స్లో ఒక తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. రైఫిల్వుమన్ పీవీ శ్రీలక్ష్మి… ఈ పారామిలిటరీ దళం మొట్టమొదటి మహిళా డాగ్ హ్యాండ్లర్గా విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఈ కీలక విభాగంలో శ్రీలక్ష్మి తన అంకితభావం, ధైర్యంతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. అస్సాం రైఫిల్స్ స్వయంగా ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడంతో, సోషల్ మీడియాలో ఆమె సాధించిన విజయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
శ్రీలక్ష్మి చేతుల్లో సరిహద్దుల భద్రత…
అస్సాం రైఫిల్స్లో డాగ్ హ్యాండ్లర్గా శిక్షణ పూర్తి చేసిన తొలి మహిళగా శ్రీలక్ష్మి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. ఆమె ఇకపై అత్యంత కీలకమైన విధులు నిర్వర్తించనున్నారు. పేలుడు పదార్థాల గుర్తింపు, దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం, ఉగ్రవాద నిరోధక చర్యల్లో చురుకుగా పాల్గొనడం ఆమె బాధ్యతల్లో ముఖ్యమైనవి. శిక్షణ సమయంలో శ్రీలక్ష్మి నిరంతరాయంగా 18 గంటల పాటు కఠినమైన విధులను సైతం సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీలక్ష్మి అసాధారణమైన విజయాన్ని కొనియాడుతూ అస్సాం రైఫిల్స్ తమ అధికారిక పోస్ట్లో ఆమెను ఆకాశానికెత్తారు. ఆమె స్ఫూర్తితో మరింత మంది మహిళలు ఈ సవాలుతో కూడిన రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్కు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన లభించింది. వేలాది మంది ఆమెను అభినందిస్తూ ఆమె ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు.