తెలుగు తెరపై ‘ఉత్తరాధి’పత్యం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్:

తెలుగు సినిమా పరిశ్రమ… ఒకప్పుడు తెలుగు భాష, సంస్కృతి, జీవన విధానాన్ని తెరపై చాటి గర్వంగా తలెత్తుకుంది. ఏటా 100-150 చిత్రాలతో బాక్సాఫీస్‌లో బాలీవుడ్‌తో సమానంగా పోటీపడిన ఈ పరిశ్రమ, ఇప్పుడు ఉత్తరాది నటుల ఆధిపత్యం ముందు గిలగిలలాడుతుంది. తమన్నా, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, బాబీ డియోల్, సునీల్ షెట్టి, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఉత్తరాది సినీ తారలు టాలీవుడ్‌ను సాంస్కృతికంగా ఆక్రమిస్తూ ఆర్టిస్ట్‌లుగా పాగా వేస్తున్నారు. ఈ సాంస్కృతిక దాడి వల్ల స్థానిక తెలుగు కళాకారులు అవకాశాలు కోల్పోతూ పరిశ్రమ నుంచి అంతర్ధానమవుతున్నారు.

బాలీవుడ్ గ్లామర్ దాడి…

గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో ఉత్తరాది హీరోయిన్ల ఆధిపత్యం పెరిగిపోయింది. స్థానిక యువతులకు అవకాశాలు సన్నగిల్లాయి. ఒకప్పుడు జయప్రద, జయసుధ, వాణిశ్రీ, రోజా, రమ్యకృష్ణ, సౌందర్య వంటి దక్షిణాది హీరోయిన్లు ఎక్కువగా కనిపించేవారు.

ఇప్పుడు తమన్నా భాటియా (ముంబై), కాజల్ అగర్వాల్ (ముంబై), రకుల్ ప్రీత్ సింగ్ (న్యూఢిల్లీ), కృతి శెట్టి (ముంబై), అనన్య పాండే (ముంబై), శ్రద్ధా కపూర్ (ముంబై), తాప్సీ (న్యూఢిల్లీ), పూజా హెగ్డే (ముంబై), కియారా అద్వానీ (ముంబై), దిశా పటానీ (బరేలీ, ఉత్తరప్రదేశ్) టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.

అనుష్క, కీర్తి సురేష్, నయనతార, సమంత, త్రిష, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, శ్రీలీల వంటి వారికి అవకాశాలు సన్న గెలుతున్నాయి. ఈశా రెబ్బా, నందిత రాజ్, రీతు వర్మ, శ్రీ దివ్య, రోజా, రంభ, మీనాలు కనుమరుగయ్యారు. ఉత్తరాది నటీమణులు డబ్బింగ్ కళాకారిణుల సహాయంతో నటిస్తూ స్థానిక సహజ భాషా నైపుణ్యాలను దెబ్బతీస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుల రంగంలోనూ అంతే…

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో ఉత్తరాది నటుల ఆధిపత్యం స్థానిక నటుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సోనూ సూద్ (పంజాబ్), సునీల్ షెట్టి (ముంబై), జగపతి బబ్బర్ (ముంబై), బాబీ డియోల్ (ముంబై), సన్నీ డియోల్ (ముంబై), వివేక్ ఒబెరాయ్ (ముంబై), ముఖేష్ రిషి (ముంబై), షియాజీ షిండే (మహారాష్ట్ర), ఆశిష్ విద్యార్థి (న్యూఢిల్లీ) మన తెలుగు ఇండస్ట్రీని ఆక్రమించారు.

దీంతో దక్షిణాదికి చెందిన సాయి కుమార్, శ్రీకాంత్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, నాజర్, బాబు మోహన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం వంటి వారికి అవకాశాలు తగ్గాయి. చిన్న పాత్రల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. చిత్రం శ్రీను, కాదంబరి కిరణ్, ఉత్తేజ్, సుధాకర్, గిరిబాబు వంటి వారికి అవకాశాలు సన్నగిల్లాయి.

టాలీవుడ్ లో 500 మంది కనుమరుగు…

గత దశాబ్దంలో పెద్ద చిత్రాల్లో 60-70% హీరోయిన్ పాత్రలు ఉత్తరాది నటీమణులకు దక్కాయి. దీనివల్ల 50-60 మంది స్థానిక నటీమణులు అవకాశాలను కోల్పోయారు. పెద్ద చిత్రాల్లో 40-50% విలన్, క్యారెక్టర్ పాత్రలు ఉత్తరాది నటులకు దక్కాయి. దీనివల్ల సాయి కుమార్, శ్రీకాంత్, బాబు మోహన్ వంటి 30-40 మంది స్థానిక నటులు బాధితులయ్యారు. చిన్న చిత్రాల్లో సహాయ పాత్రల్లో ఉత్తరాది నటులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిత్రం శ్రీను, ఉత్తేజ్ వంటి జూనియర్ ఆర్టిస్టులు 100-150 మంది అవకాశాలను కోల్పోతున్నారు. మొత్తంగా టాలీవుడ్‌లో సీనియర్ నుంచి చిన్న నటులు సహా జూనియర్ ఆర్టిస్టులను కలుపుకుంటే దాదాపు 500 మంది ఉత్తరాది దిగుమతి ధోరణి వల్ల బాధితులవుతున్నారని అంచనా.

స్థానిక నటులకే పట్టం కట్టాలి: సౌత్ సేన

స్థానిక నటులకు అవకాశాలు కల్పించడానికి నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలని సౌత్ సేన డిమాండ్ చేస్తుంది. పెద్ద నిర్మాణ సంస్థలు స్థానిక నటులకు కేటాయించే నిబంధన అమలు చేయాలని సౌత్ సేన అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక నటీమణులను, క్యారెక్టర్ ఆర్టిస్టులను ప్రోత్సహించే చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ స్థానిక నటులను గుర్తించాలి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉత్తరాది పెత్తనమే కొనసాగితే టాలీవుడ్ సాంస్కృతికంగా పతనం అవుతుంది. ఈ సాంస్కృతిక ఊచకోతను అడ్డుకోవడం ప్రతి దక్షిణాది పౌరుడి బాధ్యతని వారు పేర్కొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *