ఉగ్రదాడికి అంతర్గత సాయంపై అనుమానాలు

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి దేశీయంగా ఎవరైనా సాయం చేశారా అన్న అనుమానాలు ఉన్నాయని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కోల్ కతాలో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు ఎలా చొచ్చుకురాగలిగారనే దానిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎక్కడో పెద్ద లోపం జరిగింది. ఇంత మంది చొరబాటుదారులు ఎలా లోపలికి వచ్చారో క్షుణ్ణంగా విచారించాల’ని ఆయన డిమాండ్ చేశారు.

ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఘోరం…

‘ఇది కచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ తప్పిదాలకు ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించిన వారు ఉంటారు. వారిని గుర్తించి జరిగిన పరిణామాలకు బాధ్యులను చేయాల’ని రాయ్‌చౌదరి అన్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులైన వారిపై ఉన్నత స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్, దాని గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

దీటైన జవాబు ఇవ్వాల్సిందే!

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై తీసుకున్న దౌత్యపరమైన చర్యలు ఏమాత్రం సరిపోవని రాయ్‌చౌదరి అభిప్రాయపడ్డారు. ‘మనం తీసుకున్న దౌత్యపరమైన చర్యలు సరిపోవు. దీనికి దీటైన ప్రతిఘటన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఆ చర్యలు ఏ రూపంలో ఉండాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. కేవలం సాధారణ చర్యలు సరిపోవ’ని ఆయన తేల్చి చెప్పారు. ‘మనం కూడా అదే స్థాయిలో స్పందించాలి, అలా చేస్తేనే ఫలితం ఉంటుంది. అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కొనసాగిస్తూనే మనం ప్రతీకారం తీర్చుకోవాలి. ఇక చాల’ని రాయ్‌చౌదరి స్పష్టం చేశారు.

పాక్ ఆర్మీ చీఫ్ ఉగ్రవాదులకు అనుకూలం…

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కశ్మీర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రేరణగా పనిచేశాయా అనే ప్రశ్నకు రాయ్‌చౌదరి ఖచ్చితంగా అవునని సమాధానమిచ్చారు. ‘పాకిస్థాన్‌లో అదే జరుగుతోందని నేను అనుకుంటున్నాను. కచ్చితంగా అది ఉగ్రవాద సంస్థలకు ప్రేరణ కలిగించింద’ని ఆయన అన్నారు. జనరల్ మునీర్ ఇటీవల కశ్మీర్‌ను పాకిస్తాన్ యొక్క ‘జీవనాడి’గా అభివర్ణించిన విషయం తెలిసిందే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *