- హైదరాబాదులో నల్ల బ్రాడ్జీలు ధరించి నిరసన
- పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు
- ఇస్లాం పేరుతో పర్యాటకులను చంపడంపై ఫైర్
సహనం వందే, హైదరాబాద్:
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శుక్రవారం మక్కా మసీదు వద్ద జరిగిన జుమా నమాజ్లో పాల్గొన్న ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. నమాజ్ అనంతరం వారు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నాయకత్వం వహించారు. పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్లోని ముస్లిం సమాజం కూడా ఈ దాడిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఐక్యంగా నిరసన తెలిపింది.
ఇస్లాం పేరుతో చంపితే ఊరుకోం…
మక్కా మసీదు వద్ద జరిగిన జుమా నమాజ్కు వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. వారంతా తమ చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇస్లాం పేరుతో అమాయకులను చంపడాన్ని మనం ఎప్పటికీ ఒప్పుకోమని ఆయన హెచ్చరించారు. ఈ పిలుపునకు స్పందించి పెద్ద సంఖ్యలో ముస్లింలు మక్కా మసీదు వద్ద నిరసనలో పాల్గొన్నారు.
ఒవైసీ సోదరుల నాయకత్వం

ఈ నిరసన కార్యక్రమాల్లో అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఒక మసీదు వద్ద అసదుద్దీన్ స్వయంగా నల్ల రిబ్బన్లు ధరించి, నమాజ్కు వచ్చిన వారికి వాటిని పంపిణీ చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ కూడా నిరసనలో పాల్గొని ఉగ్రవాదాన్ని ఖండించారు. దేశ సమైక్యతను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. నమాజ్ తర్వాత చార్మినార్ ప్రాంతంలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు.
కుట్రలను తిప్పిగొడదాం…
నిరసనకారులు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను తీవ్రంగా విమర్శించారు. ఈ దాడి భారతదేశ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నమని వారు అన్నారు. “పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యలతో మన దేశ శాంతిని చెడగొట్టాలని చూస్తోంది. కానీ మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ సోదరులందరం కలిసికట్టుగా ఉండి ఈ కుట్రలను తిప్పికొడతాం,” అని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఒక ర్యాలీలో అన్నారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, భోపాల్, వారణాసి, లక్నో వంటి ఇతర నగరాల్లో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి.
ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్న ఒవైసీ…
అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడిని ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి వరకు పహల్గాంలో రెండు సీఆర్పీఎఫ్ యూనిట్లు ఉండేవి. వాటిని ఎందుకు తొలగించారు? ఈ దాడి ఉరీ, పుల్వామా దాడుల కంటే పెద్దది,” అని ఆయన అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. కాశ్మీరీ ప్రజలపై తప్పుడు ప్రచారం చేయవద్దని కూడా ఆయన కోరారు. మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాల్లో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనలు శాంతియుతంగా ముగిశాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు.