- ఒకవైపు పాకిస్తాన్… మరోవైపు చైనా
- బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు కూడా…
- అమెరికా, రష్యా దేశాల ద్వంద వైఖరులు
- పలుసార్లు పాకిస్తాన్ కు అండగా అమెరికా
- అంతర్జాతీయంగా బలాన్ని పెంచుకోవాల్సిందే
సహనం వందే, ఢిల్లీ:
మన దేశం చుట్టూ శత్రుదేశాల కోరలు చాస్తున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యలతో నిత్యం మనల్ని రెచ్చగొడుతోంది. ఉత్తరాన చైనా తన దుష్ట పన్నాగాలతో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లు ఆగడం లేదు. దక్షిణాన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే… ఆఫ్ఘనిస్తాన్లోని అల్లకల్లోల పరిస్థితులు మనకు నిత్యం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ శత్రుదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మనపై కుట్రలు పన్నుతుండటం మరింత ప్రమాదకరం.
చైనా పావులు… శత్రువులకు ఊతకర్ర!
చైనా తన ఆర్థిక, సైనిక బలంతో మన చుట్టూ ఉన్న శత్రుదేశాలకు అండగా నిలుస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకలకు ఆయుధాలు, డబ్బులు అందిస్తూ వారిని మనపైకి ఉసిగొల్పుతోంది. చిన్న దేశమైన పాకిస్తాన్ కూడా మనపై తెగబడుతోందంటే… దాని వెనుక చైనా అండదండలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ శత్రువుల ఐక్యత మనకు పెను సవాలుగా మారింది.
అమెరికా నాటకాలు…
అంతర్జాతీయంగా చూస్తే అమెరికా కూడా మనకు నిజమైన మిత్రుడిగా కనిపించడం లేదు. ఒకవైపు మనతో స్నేహం నటిస్తూనే… మరోవైపు పాకిస్తాన్కు సహాయం చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతోంది. వారి స్వార్థపూరిత రాజకీయాల వల్ల మనకు అంతర్జాతీయంగా మద్దతు కరువవుతోంది. అమెరికా వల్లే తాము ఇండియాలో ఉగ్రదాడులు చేయాల్సి వస్తుందని శుక్రవారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అన్నారంటే అందులో కొంత వాస్తవం లేకపోలేదు. చైనాకు, రష్యాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఆర్థిక, ఆయుధం సరఫరా చేసింది అమెరికానే. కాబట్టి మన చుట్టూ శత్రు దేశాలే కాదు… అగ్రరాజ్యాలు కూడా అనుకూలంగా లేకపోవడం గమనార్హం.
మన రక్షణ… మన బాధ్యత!
ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మన విదేశాంగ విధానాన్ని మరింత పదును పెట్టాలి. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలను అంతర్జాతీయంగా ఒంటరి చేయాలి. మన సరిహద్దులను దుర్భేద్యంగా మార్చాలి. శత్రుదేశాల కుట్రలను తిప్పికొట్టేందుకు సమర్థమైన రక్షణ వ్యూహాలు రచించాలి. పహల్గామ్లో చిందిన ప్రతి రక్తపు బొట్టు మన గుండెల్లో ఒక గాయాన్ని చేసింది. ఆ అమాయక ప్రాణాల ఆర్తనాదాలు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ దాడిని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ దుర్ఘటనకు కారకులైన ఉగ్రవాదులను, వారికి సహకరించిన శక్తులను కఠినంగా శిక్షించాలి.