హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి మనకెందుకు?

దేశభక్తిని తాకట్టు పెట్టే దందా!

హైదరాబాద్‌లో పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారాలు కొనసాగించడానికి అసలు కారణమేమిటి? కరాచీ, పెషావర్, లాహోర్, ఇస్లామాబాద్ వంటి పేర్లను తమ హోటళ్లు, బేకరీలకు పెట్టాల్సిన అవసరం వ్యాపారస్తులకు ఎందుకు వచ్చింది? మొదటి నుంచీ పాకిస్తాన్‌తో మనకు వైరం ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మన సైనికులను, పౌరులను పొట్టనబెట్టుకుంటున్న దేశం పట్ల ఈ వ్యాపారస్తులకు ఎందుకంత ప్రేమ? గతంలో పెట్టామని కొందరు సమర్థించుకోవచ్చు. కానీ అప్పుడైనా పాకిస్తాన్ పేర్లను ఎంచుకోవాల్సిన ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా? శత్రుదేశపు నగరాల పేర్లను పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశమంతా ఉగ్రవాదంపై పోరాడుతున్న వేళ, ఈ పేర్లను కొనసాగించడం దేశభక్తిని అవమానించడమే.

పాక్ వ్యాపారాలు కానప్పుడు పేర్లు ఎందుకు?

ఇవి పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న సంస్థలు కావు. మన దేశానికి చెందిన వ్యాపారస్తులే వీటిని నడుపుతున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్‌లోని నగరాలపై వారికి అంత ప్రేమ ఎందుకు? వారి వ్యాపారాలకు ఆ పేర్లు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం వ్యాపార దృష్టితో పెట్టిన పేర్లయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని మార్చడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?

పాకిస్తాన్ పేర్లను మార్చాల్సిందే…

పౌర సమాజం ముక్తకంఠంతో ఈ పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధం ఉన్నా సరే వాటిని బహిష్కరించాల్సిన సమయం ఇది. కరాచీ బేకరీ కావచ్చు… పెషావర్ హోటల్ యజమాని కావచ్చు… మీ వ్యాపారం కంటే దేశం ముఖ్యం అని గుర్తెరగాలి. ఇకనైనా ఈ వ్యాపార సంస్థలు మేల్కోవాలి. తమ పేర్లను వెంటనే మార్చుకోవాలి. ఇది కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, దేశం పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకునే చర్య. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న జవాన్లకు, ఉగ్రవాదుల చేతిలో బలవుతున్న అమాయక పౌరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి ఇదే.

బాయ్ కాట్ పాకిస్తాన్…

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆ దేశంతో ఉన్న అన్ని బంధాలను తొలగించింది. కాశ్మీర్ ఊచకోత తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో స్వీట్లు పంచుకున్నారంటే ఎంత దారుణం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పేర్లను తొలగించాలి. పాకిస్తాన్ పేర్లతో ఉన్న ప్రతి వ్యాపార సంస్థ పేరు మారే వరకు మన పోరాటం ఆగదు. ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి ఆవేదన. ‘బాయ్ కాట్ పాకిస్తాన్’ అంటూ ‘యాంటీ పాకిస్తాన్ మూమెంట్’ నాయకులు, సౌత్ సేన కోశాధికారి రమేష్ (పృద్వి) పిలుపు ఇచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *