- హిండెన్బర్గ్ ఆరోపణలకు చెక్
- నిజ నిర్ధారణ చేసుకున్న గ్రూప్
- అయినా అనేక అనుమానాలు
సహనం వందే, హైదరాబాద్:
ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్పై 2023లో హిండెన్బర్గ్ అనే సంస్థ చేసిన ఆరోపణలకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో అదాని గ్రూపు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినట్లు వార్తా సంస్థలు చెప్తున్నాయి. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక మోసాలు చేసిందని 2024లో హిండెన్బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల వల్ల అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఎదుర్కొనేందుకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ అనే ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా హిండెన్బర్గ్ సంస్థకు సహకరిస్తున్న ఆర్థిక, రాజకీయ శక్తులను ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం, అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకున్న కొన్ని శక్తుల గురించిన వివరాలను వెల్లడించడం, ఇతర దేశాలతో సత్సంబంధాలు నెరపడం వంటి చర్యల ద్వారా వివరాలను బయటపెట్టింది. ఇదిలా ఉంటే హిండెన్బర్గ్ సంస్థ అదాని గ్రూపుపై ఆరోపణలు చేసిన రెండేళ్ల తర్వాత, హిండెన్బర్గ్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇది అదానీ గ్రూప్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అదానీ గ్రూప్ మళ్లీ మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి పొందింది. అయితే ఆపరేషన్ ద్వారా అదానీ గ్రూప్ మళ్లీ బలపడిందని కొందరు భావిస్తుండగా, మరికొందరు మాత్రం హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక నిపుణులు ఆపరేషన్ జెప్పెలిన్ను ఒక అద్భుతమైన ప్రణాళికగా అభివర్ణించారు.