- తెలుగులో రాసిన వారికి అన్యాయం
- మెయిన్స్ మూల్యాంకనంలో పొరపాట్లు
- తెలుగు మీడియం అభ్యర్థులపై వివక్ష
- అత్యంత కఠినంగా నిబంధనల అమలు
- ఇతర భాషల్లో రాసినవారికి మంచి మార్కులు
- గగ్గోలు పెడుతున్న అభ్యర్థులు…
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు దగాపడ్డారు. దాదాపు పది సంవత్సరాలుగా పక్కాగా సన్నద్దమైన తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గత నెల 30న మెయిన్స్ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ… గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసి ఇటీవల విడుదల చేసింది. మొత్తం 563 మందిని ఎంపిక చేస్తూ… వారి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తోంది. మెయిన్స్ ఫలితాలు, అర్హుల జాబితాలపై అభ్యర్థుల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులు మెయిన్స్ ఫలితాల్లో అణిచివేతకు గురైనట్లు అభ్యర్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రధానంగా మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్రస్థాయిలో పొరపాట్లు జరిగాయని, తెలుగు మీడియం అభ్యర్థులపై వివక్ష చూపుతూ అత్యంత కఠిన నిబంధనలు అమలు చేయగా… ఇంగ్లీషు, ఉర్దూ మీడియం అభ్యర్థుల జవాబుపత్రాలను అత్యంత సాధారణంగా దిద్దారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలేం జరిగిందంటే…?
మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కోసం టీజీపీఎస్సీ వాల్యూయేటర్లను ఎంపిక చేసింది. ఈ ప్రక్రియలో భారీగా పొరపాట్లు జరిగాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు మీడియం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రధానంగా స్థానిక బాషలో మూల్యాంకనం చేసేందుకు అవసరమైనంత మంది ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో మూల్యాంకనం ప్రాథమిక నిబంధనలును వివరిస్తూ వాటి ప్రకారం దిద్దాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆయా వాల్యుయేటర్లు నిబంధనలకు లోబడి జవాబుపత్రాలను దిద్దారు. ఆ మేరకు అభ్యర్థులకు మార్కులు నిర్దేశించారు. అయితే ఇంగ్లీషు, ఉర్దూ మీడియం వాల్యూయేటర్ల ఎంపిక ప్రక్రియ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన వారిని ఎంపిక చేశారు. అలా ఎంపిక చేసిన వాల్యుయేటర్లు టీజీపీఎస్సీ నిబంధనలు అనుసరిస్తూనే… జవాబు రాసిన విధానానికి ప్రాధాన్యత ఇస్తూ స్వేచ్ఛగా మార్కులు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు మీడియంలో జవాబులకు టీజీపీఎస్సీ నిర్దేశించిన నిబంధనలకు లోబడి మార్కులు కేటాయించగా… ఇంగ్లీషు మీడియంలో మాత్రం అభ్యర్థులకు టీజీపీఎస్సీ నిర్దేశించిన మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. ఈ క్రమంలో మెయిన్స్ ఫలితాలు ప్రకటించిన సమయంలో జాబితాలో తెలుగు మీడియం అభ్యర్థులు అట్టడుగుకు పడిపోయారు. వాస్తవానికి మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ఉర్దూ మీడియంలో పెద్దగా అందుబాటులో లేదు. అయినప్పటికీ ఉర్దూ మీడియం అభ్యర్థులు పదిమందికి పైగా అత్యుత్తమ మార్కులు సాధించడం గమనార్హం. తెలుగు మీడియం అభ్యర్థులపై కఠినత్వంతోనే వారు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు అభ్యర్థులు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
– రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీజీపీఎస్సీ గతేడాది ఫిబ్రవరిలో 563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 403465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
– గతేడాది జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాల్లో ఓఎంఆర్ పద్దతిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. జులై 7వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
– గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు గతేడాది అక్టోబర్ 21 నుంచి 27వరకు హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో టీజీపీఎస్సీ నిర్వహించింది. ఈ మెయిన్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు ఎంపిక కాగా… మరో 20 మంది అభ్యర్థులు కోర్టు ఆదేశాలతో అర్హత సాధించారు. మొత్తం 31403 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా… మొత్తం 7 పేపర్లకు హాజరైన వారు 21093 మంది మాత్రమే.
– మెయిన్స్ పరీక్షలకు సంబంధించి తుది ఫలితాలను ఈ ఏడాది మార్చి 30న టీజీపీఎస్సీ విడుదల చేసింది. అనంతరం ఈనెల 9వ తేదీన 563 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ విడుదల చేసింది. ఈ అభ్యర్థులకు ఈనెల 22వరకు నిర్దేశించిన తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనను నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పూర్తి చేసింది.