హిందువులే లక్ష్యంగా రక్తపుటేరు

  • పర్యాటకుల పేర్లు, మతాలను అడిగి మరీ హిందువులపై మారణహోమం
  • 27 మంది బలి… అందులో హైదరాబాద్ ఐబీ అధికారి
  • పర్యాటక ప్రదేశం పహల్గామ్ రక్తసిక్తం

మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూమతమే లక్ష్యంగా ఆ మత ప్రజలను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్ రక్తంతో తడిసిపోయింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ఈ ప్రశాంతమైన లోయలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్‌ రంజన్‌తో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా గాయపడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. 2019లో పుల్వామాలో జరిగిన భీకర దాడి తర్వాత కాశ్మీర్‌లో ఇంతటి ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి.

బైసరన్ మైదానంలో మారణహోమం…

మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో పహల్గామ్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ మైదానంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఒక్కసారిగా దాదాపు 40 మంది అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుగాంచిన ఆ ప్రదేశం గుర్రపు స్వారీలు, ట్రెక్కింగ్‌లకు నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు, వారి మత విశ్వాసాలను అడిగి మరీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు.

దాడి వెనక ది రెసిస్టెన్స్ ఫ్రంట్…

లష్కర్-ఎ-తొయిబాతో సంబంధాలున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ ఈ దాడికి బాధ్యత వహించినట్లు సమాచారం రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాడి అనంతరం ఉగ్రవాదులు క్షణాల్లోనే సమీపంలోని దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. వెంటనే భారత సైన్యం, జమ్ము కాశ్మీర్ పోలీసులు, పారా కమాండోలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన పహల్గామ్ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్‌లోని ప్రధాన ఆసుపత్రులకు తరలించారు.

హైదరాబాద్‌ ఐబీ అధికారి మనీష్ మృతి…

ఈ హృదయ విదారక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 27 మందిలో ఇద్దరు విదేశీ పర్యాటకులు (ఒకరు ఇజ్రాయెల్, మరొకరు ఇటలీకి చెందినవారు) ఉండగా, ఇద్దరు స్థానికులు కూడా బలయ్యారు. ఈ దుర్ఘటన హైదరాబాద్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో కీలక అధికారిగా పనిచేస్తున్న మనీష్‌ రంజన్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావు కూడా ఈ దుర్ఘటనలో మృతి చెందగా, ఆయన భార్య పల్లవి తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన పర్యాటకులు కూడా బాధితుల జాబితాలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *