- మహారాష్ట్రలో భగ్గుమంటున్న హిందీ వివాదం
- హిందీకి వ్యతిరేకంగా థాకరే కుటుంబం ఐక్యం
- మహారాష్ట్రలో మరాఠీ ఓట్ల కోసం సమీకరణ
- బెంగళూరులోనూ హిందీ భాషా వివాదం
సహనం వందే, ముంబై:
మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. హిందీకి వ్యతిరేకంగా రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటం చేసేందుకు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు సంసిద్ధత వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం భాషాభిమానమా? లేక రాజకీయ ఎత్తుగడా?
మరాఠీ ఓట్ల ఏకీకరణకు అవకాశం?
కేంద్ర ప్రభుత్వం హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయం మహారాష్ట్రలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మరాఠీ భాష, సంస్కృతిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో రాజకీయ ప్రత్యర్థులైన రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు ఒకే వేదికపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కుటుంబ వివాదాలను పక్కనపెట్టి కలసి రావాలని సూత్రపాయంగా నిర్ణయించారు. ఉద్ధవ్ థాకరే కూడా మరాఠీ సమాజం ప్రయోజనాల కోసం ఐక్యతకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
థాకరేల రాజకీయ వైరం…
రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేల మధ్య దశాబ్దాలుగా తీవ్ర వైరం ఉంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీల మధ్య రాజకీయ విభేదాలు, వ్యక్తిగత గొడవలు ఐక్యతకు పెద్ద అడ్డంకిగా మారాయి. అయితే హిందీ తప్పనిసరిగా అమలు చేయాలనే నిర్ణయం మరాఠీ గుర్తింపు, స్థానిక భాషకు ముప్పుగా పరిణమించింది. ఈ నేపద్యంలో ఇద్దరు నాయకులు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి వచ్చే అవకాశం కనిపిస్తోంది
హిందీ వ్యక్తిపై కన్నడిగుల ఆగ్రహం
బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్తో కన్నడేతర వ్యక్తి మధ్య భాష విషయంలో జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిందీలో మాట్లాడాలని డిమాండ్ చేసిన వ్యక్తిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బెంగళూరులో భాషా సమస్యలను మరోసారి తెరపైకి తెచ్చింది.
హిందీ మాట్లాడాలని డ్రైవర్ పై ఒత్తిడి…
ఒక కన్నడేతర వ్యక్తి ఆటో డ్రైవర్ను ‘బెంగళూరులో ఉండాలంటే హిందీ మాట్లాడు’ అని హెచ్చరించాడు. దీనికి డ్రైవర్ తీవ్రంగా స్పందిస్తూ, ‘నీవు బెంగళూరుకు వచ్చావు, కన్నడంలో మాట్లాడు. నేను హిందీ మాట్లాడను’ అని స్పష్టం చేశాడు. దీంతో వివాదం ముదిరింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు బెంగళూరులో నివసించేవారు కన్నడం నేర్చుకోవడం స్థానిక సంస్కృతికి గౌరవం ఇవ్వడమే కాకుండా రోజువారీ జీవితంలో సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం కన్నడం నేర్చుకోవడం తప్పనిసరి కాదని వాదించారు. అయితే, దీర్ఘకాలంలో స్థానిక భాష నేర్చుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నారు.
కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని…
బెంగళూరు బహుభాషా నగరం అయినప్పటికీ, భాషా గుర్తింపు సమస్యలు గతంలోనూ వివాదాలకు దారితీశాయి. హిందీని రుద్దడం అనే ఆరోపణలు, కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు తరచూ వినిపిస్తుంటాయి. ఈ తాజా ఘటన ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది