జలుబుకి సిగరెట్ చికిత్స

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఒక డాక్టర్ చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డాక్టర్ సురేష్ చంద్ర ఐదేళ్ల బాలుడికి జలుబు నయం చేయడానికి చికిత్స పేరుతో సిగరెట్ తాగించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై విచారణ ప్రారంభించారు. కుతుంద్‌లోని సెంట్రల్ హెల్త్ సెంటర్‌లో ఈ అమానుషమైన సంఘటన జరిగింది. వీడియోలో డాక్టర్ ఆ బాలుడికి సిగరెట్ వెలిగించి, దానిని పీల్చమని చెబుతూ స్పష్టంగా కనిపించాడు. ఈ విషయం వెలుగులోకి రాగానే వెంటనే చర్యలు తీసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర దేవ్ శర్మ, ఆ డాక్టర్ సురేష్ చంద్రను వెంటనే విధుల నుంచి తప్పించారు.

ఈ షాకింగ్ ఘటనపై అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.డి. చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. “ఇలాంటి దారుణమైన సంఘటనలను ఎంతమాత్రం సహించేది లేదు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం” అని డాక్టర్ శర్మ తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో ఇలాంటి దారుణమైన పనులు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పట్టణాల్లోని క్లినిక్‌లలో పనిచేసే వైద్యులు తప్పనిసరిగా నైతిక ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *