- ప్రియురాలిని చంపిన ప్రియుడి చర్మంతో తయారీ
- బ్రిటన్ చరిత్రలో ఒక భయంకరమైన నేరానికి గుర్తుగా ఈ పుస్తకం
- 1827లో హంతకుడికి ఉరిశిక్ష… పోస్టుమార్టం తర్వాత పుస్తకం బైండింగ్
- దాదాపు 200 ఏళ్ల నేర చరిత్రపై తిరిగి చర్చ… మ్యూజియంలో పుస్తకం
- శతాబ్దాల కిందట బ్రిటన్ లో మనిషి చర్మంతో పుస్తకాలను బైండ్ చేసే ఆచారం
సహనం వందే, లండన్:
బ్రిటన్ చరిత్రలో ఒక భయంకరమైన నేరానికి గుర్తుగా నిలిచిన పుస్తకం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హంతకుడు విలియం కోర్డర్ చర్మంతో చేసిన అరుదైన పుస్తకం సఫోల్క్లోని మోయిసెస్ హాల్ మ్యూజియంలో త్వరలో సందర్శకులకు అందుబాటులో రానుంది. ఈ పుస్తకం ఊహించని విధంగా బయటపడటంతో దీని చుట్టూ చరిత్ర, నైతికతకు సంబంధించిన ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. 19వ శతాబ్దంలో సంచలనం సృష్టించిన “రెడ్ బార్న్ మర్డర్” కేసుతో ఈ పుస్తకానికి సంబంధం ఉంది. ఆనాటి సమాజం, న్యాయవ్యవస్థ ఎలా ఉండేవో ఈ పుస్తకం తెలియజేస్తుంది.
చర్మాన్ని పుస్తకానికి తొడిగిన డాక్టర్…
1827లో సఫోల్క్లోని పోల్స్టెడ్లో జరిగిన రెడ్ బార్న్ హత్య అప్పట్లో యావత్ బ్రిటన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. విలియం కోర్డర్ అనే వ్యక్తి తన ప్రియురాలు మరియా మార్టెన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెడ్ బార్న్ వద్దకు తీసుకెళ్లి కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టాడు. 1828లో కోర్డర్ను పోలీసులు పట్టుకున్నారు. బరీ సెయింట్ ఎడ్మండ్స్లో అతడిని బహిరంగంగా ఉరితీశారు. ఉరితీసిన తర్వాత అతని శరీరాన్ని వైద్యులు పరిశీలించారు. ఆ సమయంలో అతని చర్మంతో ఒక పుస్తకాన్ని తయారుచేశారు. ఆ పుస్తకంలో అతని విచారణకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈ మొదటి పుస్తకం 1933 నుంచి మ్యూజియంలో సందర్శనకు ఉంచారు.
మరో పుస్తకం కలకలం…
ఇటీవల మ్యూజియం అధికారులు పాత రికార్డులను పరిశీలిస్తుండగా అలాంటి మరో పుస్తకం ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండో పుస్తకాన్ని కోర్డర్కు పోస్ట్మార్టం చేసిన సర్జన్ కుటుంబం మ్యూజియానికి ఇచ్చింది. ఈ పుస్తకం పూర్తిగా కాకుండా, కేవలం బైండింగ్, మూలలు మాత్రమే కోర్డర్ చర్మంతో తయారు చేశారు. మిగిలిన భాగం ఆకుపచ్చ రంగులో ఉంది. ఈ విషయాన్ని మ్యూజియం హెరిటేజ్ అధికారి డాన్ క్లార్క్ “మ్యూజియం పోగొట్టుకున్న నిధి”గా అభివర్ణించారు. ఇది దశాబ్దాల తర్వాత మళ్లీ కనిపించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
చరిత్ర పాఠమా? క్రూరమైన జ్ఞాపకమా?
మనిషి చర్మంతో పుస్తకాలను బైండ్ చేసే ఆచారం (దీనిని ఆంథ్రోపోడెర్మిక్ బిబ్లియోపెజీ అంటారు) 19వ శతాబ్దంలో ఉండేది. ఖైదీలను అవమానించడానికి లేదా వైద్యులు గుర్తుగా ఉంచుకోవడానికి ఇలా చేసేవారు. డాన్ క్లార్క్ ఈ పుస్తకాలను “చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైనవి”గా పేర్కొన్నారు. అయితే ప్రఖ్యాత రచయిత టెర్రీ డీరీ మాత్రం ఈ వస్తువులను కిరాతకమైనవిగా విమర్శించారు. కోర్డర్ను కేవలం సాక్ష్యాధారాలతోనే శిక్షించారని, అతని శరీరాన్ని పరీక్షించడం, చర్మంతో పుస్తకం తయారు చేయడం అతని శిక్షను మరింత క్రూరంగా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మ్యూజియం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు…
మోయిసెస్ హాల్ మ్యూజియం ఈ రెండు పుస్తకాలను ఒకేసారి ప్రదర్శించాలని నిర్ణయించింది. వాటి చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ సమాచారాన్ని కూడా ఉంచనుంది.