సూర్యాపేట శరత్ కార్డియాక్ సెంటర్‌లో తనిఖీలు

సూర్యాపేటలోని శరత్ కార్డియాక్ సెంటర్‌లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కార్డియాక్ సెంటర్‌లో జరుగుతున్న పలుఅక్రమాలు బయటపడ్డాయి. తనిఖీల్లో డాక్టర్లు తమ సర్టిఫికెట్లను అమ్ముకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన గుండె డాక్టర్ లేకుండానే టెక్నీషియన్ స్కాన్ చేసి డాక్టర్ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్నట్టు తేలింది. ప్రశాంత్ అనే పేషెంట్‌కు వనం శరత్ చంద్ర అనే 2డీ ఎకో టెక్నీషియన్, డాక్టర్ శిరీష (ఎంబీబీఎస్) పేరు మీద రిపోర్ట్ ఇచ్చినట్టు అధికారులు కనుగొన్నారు. అంతేకాకుండా పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం డాక్టర్ లీలకృష్ణ పేరు మీద అనుమతి తీసుకున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారం వైద్య నైతికతకు, వృత్తి నియమాలకు పూర్తిగా విరుద్ధమని, ఇది రోగుల ఆరోగ్యానికి ప్రమాదకరమని టీజీఎంసీ అధికారులు తెలిపారు. తెలంగాణలోని మరికొన్ని కార్డియాక్ సెంటర్లలో కూడా డాక్టర్లు లేకుండా టెక్నీషియన్లు గుండె స్కాన్‌లు చేసి రిపోర్ట్లు ఇస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని, ఆయా సెంటర్లపై కూడా తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేష్ కుమార్ వెల్లడించారు.

ఈ ఘటనపై డాక్టర్ లీలకృష్ణ, డాక్టర్ శిరీషలకు టీజీఎంసీ నోటీసులు జారీ చేసింది. వారు తమ పేరు వినియోగించటానికి సంబంధించిన వివరణ ఇచ్చిన తర్వాత ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటారు. ఇక టెక్నీషియన్ వనం శరత్ చంద్ర డాక్టర్‌గా చెప్పుకుంటూ వైద్య సేవలు అందించినందుకు అతనిపై ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం ఫోర్జరీ కేసు నమోదు చేయనున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన వైద్యం, నైతికత, రోగుల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *