బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది.

ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒక మహిళ బిడ్డను కనడానికి ఆసుపత్రిలో అడుగుపెట్టిన క్షణం నుండి, ఆ పసిగుడ్డును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానిదేనని కోర్టు కుండబద్దలు కొట్టింది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, ఆ ఆసుపత్రి అనుమతి లైసెన్స్ రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో కోర్టు కళ్లకు కట్టినట్టు వివరించింది. లైంగికంగా హింసించడం, వెట్టి చాకిరీ చేయించడం, భిక్షాటనకు దింపడం, నేరాలకు పాల్పడేలా చేయడం, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, చివరికి దత్తత పేరుతో పసిపిల్లలను అమ్మేయడం వంటి భయంకరమైన నేరాలకు ఈ ముఠాలు పాల్పడుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. “దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా వారి జీవితంలో తీరని దుఃఖాన్ని నింపవచ్చు” అని జస్టిస్ పార్దివాలా ఆవేదనతో అన్నారు. తమ పిల్లలు కనిపించకుండా పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని కోర్టు పేర్కొంది.

బాలల న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని రక్షణలను అక్రమార్కులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రక్షణల కారణంగానే పిల్లలను నేరాలకు పాల్పడేలా చేయడం పెరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా మన దేశంలో దత్తత ప్రక్రియలో ఆలస్యం కూడా పిల్లల అక్రమ రవాణాకు ఒక రకంగా ఊతం ఇస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.

పిల్లల అక్రమ రవాణా కేసులో అలహాబాద్ హైకోర్టు నిందితులకు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నిందితుల్లో చాలా మంది ఇంకా పరారీలో ఉండటంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుల విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు రెండు నెలల గడువు ఇచ్చింది. బాధితుల కుటుంబాలకు ప్రత్యేక న్యాయవాదులను నియమించాలని, వారికి రక్షణ కల్పించాలని కూడా ఆదేశించింది.

పిల్లల అక్రమ రవాణా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో సరిగా స్పందించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని హైకోర్టులు ఇలాంటి పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *