ఉగ్రవాది డిమాండ్లకు తలొగ్గిన ఎన్ఐఏ

2008 ముంబై మారణహోమ సూత్రధారి, వైద్య వృత్తిని అభ్యసించి ఉగ్రవాదిగా మారిన తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉన్న రాణా డిమాండ్లకు ఎన్ఐఏ తలొగ్గిందా అన్న విమర్శలు వస్తున్నాయి. అతను ఖురాన్ పుస్తకం, రాయడానికి కలం, కాగితం ఇవ్వాలని కోరడంతోపాటు రోజూ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటానని కోరాడు. దీన్ని ఎన్ఐఏ అధికారులు అనుమతించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దాదాపు పదిహేనేళ్ల న్యాయ పోరాటం తర్వాత అమెరికా నుండి భారత్‌కు అప్పగించబడిన రాణాను ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. రాణా ఇ-మెయిల్‌లు, ప్రయాణ వివరాలు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. ఈ విచారణలో లష్కర్-ఎ-తోయిబా, పాకిస్తాన్ సైన్యం-గూఢచార సంస్థల మధ్య సంబంధాలపై మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

రాణా తన చిన్ననాటి స్నేహితుడు, మరో ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి ముంబైలోని దాడి ప్రదేశాల సమాచారం ఉగ్రవాదులకు అందించడంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్య విద్య నుంచి ఉగ్రవాదం వైపు ప్రస్థానం పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన రాణా, కొంతకాలం పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పనిచేశాడు. ఆ తర్వాత కెనడాకు వలస వెళ్లి, అమెరికాలో స్థిరపడ్డాడు. ముంబై దాడులకు ముందు హెడ్లీకి సహకరించడమే కాకుండా, దాడికి సంబంధించిన సమాచారం చేరవేశాడని అభియోగాలు ఉన్నాయి.

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత భారత్‌కు 2009లో అరెస్ట్ అయిన రాణాకు 2011లో అమెరికా కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2020లో విడుదలైనప్పటికీ, భారత్ అతని అప్పగింత కోసం ప్రయత్నించింది. రాణా అప్పగింత 26/11 కేసులో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ దాడిలో పట్టుబడిన కసబ్‌ను ఉరితీసినప్పటికీ, సూత్రధారులను శిక్షించడం ఇంకా పెండింగ్‌లో ఉంది. రాణా విచారణతో ఈ కేసులో మరింత సమాచారం వెల్లడవుతుందని భావిస్తున్నారు. ఈ కేసులో భారత్ తరపున న్యాయవాది దయాన్ కృష్ణన్ అమెరికా కోర్టుల్లో పోరాడారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *