- 2019 తర్వాత పెరిగిన ప్రయాణీకులు
- 2024లో 4.7 బిలియన్ల మంది ప్రయాణం
- ఏడాది కాలంలోనే 20 శాతం పెరుగుదల
సహనం వందే, న్యూఢిల్లీ:
కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగేళ్లపాటు భారీగా పడిపోయిన విమాన ప్రయాణాలు… గత ఏడాది నుంచి మళ్లీ పుంజుకున్నాయి. 2024లో ప్రపంచ వైమానిక ప్రయాణికుల సంఖ్య 2019 స్థాయిలను అధిగమించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం… 2024లో మొత్తం ప్రయాణికుల సంఖ్య 4.7 బిలియన్లకు చేరుకుంది, ఇది 2019లో నమోదైన 4.5 బిలియన్ల కంటే ఎక్కువ.
నాలుగేళ్లు దెబ్బ తిన్న విమానరంగం…
2020లో కోవిడ్ కారణంగా విమాన ప్రయాణ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. లాక్డౌన్లు, ప్రయాణ ఆంక్షలు, ఆరోగ్య భయాలు విమాన సర్వీసులను స్తంభింపజేశాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎయిర్లైన్లు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే టీకాల పంపిణీ, ఆంక్షల సడలింపు, ప్రయాణికులలో పెరిగిన ఆత్మవిశ్వాసం 2022 నుంచి క్రమంగా పుంజుకోవడం ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ మాట్లాడుతూ, “2024 ఒక గీటురాయి. ప్రయాణికుల సంఖ్య పూర్తిగా పుంజుకోవడమే కాకుండా, ,గత రికార్డులను బద్దలు కొట్టింది. ఇది ఎయిర్లైన్ రంగం సమర్థతను చాటుతుంది,” అని అన్నారు. రెవెన్యూ ప్యాసెంజర్-కిలోమీటర్స్ ఆధారంగా లెక్కించిన ట్రాఫిక్ డేటా ప్రకారం, 2024 ఫిబ్రవరిలోనే 2019 స్థాయిలను అధిగమించినట్లు ఆయన తెలిపారు.
ఏడాదిలో 20% పెరుగుదల…
విమానయానం పెరుగుదలలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే చైనా వంటి దేశాలు తమ సరిహద్దులను పూర్తిగా తెరిచాయి. అంతర్జాతీయ ప్రయాణాలు 2023తో పోలిస్తే 2024లో 20% పెరిగాయి, దేశీయ ప్రయాణాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయి. భారతదేశంలో విమాన ప్రయాణాలు గత పది ఏళ్లలో అత్యధికంగా పెరిగాయి. దీనికి తక్కువ విమాన చార్జీలు, కొత్త విమానాశ్రయాల నిర్మాణం దోహదపడ్డాయి.