బిలియనీర్ల ఆర్థిక ఉగ్రవాదం

భారతదేశంలోని అత్యంత సంపన్నులు తమ ఆదాయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. మధ్యతరగతి కంటే తక్కువ పన్నులు చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అసమానతలకు కారణమవుతున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. అగ్రశ్రేణి బిలియనీర్లు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ తమ వాస్తవ ఆదాయాన్ని దాచిపెట్టి, సంపదను విదేశాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి ప్రజలు మాత్రం అధిక పన్నుల భారంతో కుంగిపోతున్నారు.

ధనికుల ఆర్థిక మాయాజాలం…

ఈ పరిశోధన ప్రకారం అత్యంత బిలియనీర్లు తమ మొత్తం సంపదలో కేవలం 2 శాతం కంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే ఆదాయంగా చూపిస్తున్నారు. అలాగే అగ్రగామి ఒక శాతం సంపన్నులు కేవలం 3-4 శాతం ఆదాయాన్ని మాత్రమే వెల్లడిస్తున్నారు. అత్యంత సంపన్నులైన 5 శాతం మంది తమ మూలధన ఆదాయంలో ఐదవ వంతు కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా దిగువ స్థాయిలో ఉన్న 10 శాతం మధ్యతరగతి కుటుంబాలు తమ సంపద కంటే రెట్టింపు ఆదాయాన్ని నివేదిస్తున్నాయి. ఈ గణాంకాలు ధనవంతులు ఎంత తెలివిగా తమ సంపదను దాస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎగవేత కారణంగా వారి భారీ సంపద పన్ను పరిధిలోకి రావడం లేదు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని పన్నుల రూపంలో చెల్లించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

విదేశీ ఖాతాలు … బినామీ కంపెనీలు

సంపన్నులు పన్ను రహిత దేశాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి తమ సంపదను దాస్తున్నారు. విదేశీ బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తి పెట్టుబడులు, షేర్ మార్కెట్ లావాదేవీల్లో పన్ను మినహాయింపులను తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ వ్యూహాల ద్వారా వారి నిజమైన ఆస్తులు, ఆదాయం ప్రభుత్వ అధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

ఆదాయపు పన్ను యంత్రాంగం ప్రేక్షక పాత్ర?

మధ్యతరగతి ప్రజలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ నిత్యావసరాల కోసం కుస్తీ పడుతున్నారు. ధనవంతులు తమ సంపదను దాచి తక్కువ పన్నులు చెల్లించడం వల్ల ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి. ఈ చర్య సామాజిక విభేదాలను పెంచి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *