దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, లేక అమ్ముడుపోయి బానిసలుగా మిగిలిపోతారో అనేది మీ చేతుల్లోనే ఉంద”న్నారు అంబేద్కర్. నేడు అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఆయన రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం నుంచి పలు అంశాలు పరిశీలిద్దాం.

అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ పుస్తకంలో కీలక అంశాలు…

  • ఒక దేశాన్ని పరిపాలించే అర్హత మరొక దేశానికి లేదనే “మిల్లు” దొర సిద్ధాంతాన్ని పదే పదే వల్లించే ప్రతీ కాంగ్రెస్ వ్యక్తీ, ఒక వర్గం ప్రజల్ని అణగదొక్కి ఉంచే అధికారం మరొక వర్గానికి లేదనే విషయాన్నీ అంగీకరించి తీరాలి.
  • అధికారం అంటే ఆర్థికాధికారం ఒక్కటే అనే సిద్ధాంతాన్ని సమాజ చరిత్ర పరిశోధకులెవ్వరూ అంగీకరించరు. వ్యక్తికి ఉండే సాంఘికస్థాయి ఒక్కటి మాత్రమే హోదాకు అధికారానికీ మూలాధారం కాదు. సామాన్య మానవుడి మీద మహాత్ములు చలాయిస్తున్న ప్రభావమే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో పైసా లేని సాధువులకు, పకీరులకు కోటీశ్వరులైన వాళ్ళు విధేయులై ఉంటారెందుకు? భారతదేశంలోని కోట్లకొలది దరిద్రులు తమకున్న చిల్లర మల్లర వస్తువులన్నీ అమ్ముకొని కాశీకి, మక్కాకూ పోతున్నారెందుకు? మతం సమస్తాధికారాలకు మూలాధారం అనే సత్యం భారతదేశ చరిత్ర సదా నిరూపిస్తూనే వుంది. సామాన్య మానవుడి మీద మేజిస్ట్రేటు కంటే కూడా మతాచార్యుడు ఎక్కువ అధికారాన్ని చెలాయించగలిగిన భారతదేశంలో మతమే అధికారానికి మూలభూతం అనేది సర్వవిదితం. ఇక్కడ సమ్మెలు ఎన్నికలు వంటివి కూడా క్షణంలో మతావేశానికి దారితీస్తాయి. ఇట్టే మత సమస్యలుగా పరిణమిస్తాయి.
  • మతం, సాంఘిక స్థాయి, ఆస్తి ఈ మూడూ కూడా శక్తికీ, అధికారానికీ మూల కారణాలే. అవి కలిగిన ఏ మనిషి అయినా సరే – మరొక మనిషి స్వేచ్ఛా స్వాతంత్రాలను తన అధీనంలో ఉంచుకోగలడు. అయితే ఆ మూడింటిలోను ఒకటి ఒక దశలో ప్రాముఖ్యం వహిస్తే, మరొకటి మరొక దశలో ప్రాధాన్యం వహిస్తుంది. అంతే తేడా.
  • మనదేశంలో పేదవారైన కార్మికవర్గం పేద, ధనికవర్గ భేదాన్ని తప్ప మరే విభేదాలను పాటించరని చెప్పగలమా? భారతదేశంలో పేదలైనవారు కుల, మత, నిమ్న ఉన్నత విభేదాలను గుర్తించడం లేదా? అలాంటి భేదాలు ఎన్నో స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, వాళ్లంతా కలిసి ధనిక వర్గానికి వ్యతిరేకంగా ఎలా ఏకం కాగలరు? కార్మిక వర్గం అంతా కలిసి ఏకం కాకపోతే, ఏకముఖంగా పోరాడడానికి ఉద్యమించకపోతే విప్లవం ఎలా రాగలదు? ఇంపైన సమాసాలను, భాషను వాడడంలోనే సోషలిస్టులు తృప్తిపడకుండా, సోషలిజం అనేదాన్ని నిర్దిష్టమైన వాస్తవరూపంలో సాధించాలనే కోరిక తమకుంటే వారు సాంఘిక సంస్కరణ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించక తప్పదు. వేరే మార్గాంతరం లేదు.
  • నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే, దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కరణ గాని, ఆర్థిక సంస్కరణగాని సాధించలేవు.
  • కులవ్యవస్థ మనుషులను జాతిరీత్యా విభజించడం లేదు. అది ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తున్నది.
  • “జాతి చైతన్యం” అనేది హిందువులలో ఏ మాత్రమూ లేదు. తామంతా ఒక జాతి అన్న చైతన్యమే లేదు. హిందువులలో ఉన్న చైతన్యం ఒక్కటే! కులచైతన్యం. హిందువులు ఒక సమాజం అని గాని, ఒక “నేషన్” అని గాని లేకపోవడానికి ఇదే కారణం… హిందువులు కేవలం కొన్ని కులాలు మాత్రమే కాదు. ఏ కులానికా కులం తమ స్వప్రయోజనాలను రక్షించుకోవడం కోసం తక్కిన కులాలతో నిరంతరం పోరాటం సలిపే విడివిడి గుంపులు.
  • కులవ్యవస్థ ఉన్నంతకాలం సంఘటిత శక్తి రాదు. సంఘటిత శక్తి లేనంతవరకూ హిందువుడు బలహీనుడుగాను, పిరికివాడుగా ఉండకతప్పదు.
  • కులం పునాదుల మీద మీరు దేన్నీ నిర్మించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు. ఒక నీతినీ నిర్మించలేరు. కులం పునాదుల మీద మీరు ఏదైనా నిర్మిస్తే అది పగిలి ముక్కలు కావడం తప్పదు
  • కుల నిర్మూలనకు సరైన పద్ధతి వర్ణాంతర వివాహాలేనని నా దృఢ విశ్వాసం. రక్తసమ్మిశ్రణ ఒక్కటే మానవులలో అన్యోన్య అనుబంధ భావాన్ని, బాంధవ్యాన్ని కలిగిస్తుంది. అట్టి బంధు భావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను, వివక్షతలను రూపుమాపలేం. వివిధ కులాల మధ్య స్నేహానుబంధాలను కలిగించాలంటే, ఆయా కులాల, వ్యక్తుల నడుమ రక్తసంబంధాలను కల్పించక తప్పదు.
  • ఆయుధాలు తయారుచేసే వ్యక్తిని, అతడి వ్యక్తిగత ప్రవర్తన మంచి వాణ్ణిగా చేయగలదా? అంటే అతడు చేసిన తుటాలు పేలకుండానూ, విషవాయువు చంపకుండానూ ఉండగలదా? అలా కాని పక్షంలో – కుల చైతన్యంతో నిండి ఉన్న ఒక వ్యక్తిని అతడి వ్యక్తిగత ప్రవర్తన మంచివాణ్ణిగా మార్చగలదని మీరు ఎలా ఆశిస్తారు? కులతత్వంతో నిండివున్న వ్యక్తి ఎంత సత్ప్రవర్తన కలవాడైనా తక్కిన కులాల వ్యక్తుల్ని మిత్రులుగాను, తనతో సమానులుగాను చూడడం ఎలా సాధ్యం?
  • దేశంలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల ప్రజలకు తమ పోరాటాల గురించిన జ్ఞానం లేకపోవటం అనేది అగ్రకుల హిందువులకు ఒక వరంగా ఉపయోగపడింది. వారిలోని అజ్ఞానాన్ని, బలహీనతను ఆధారం చేసుకుని వారిలో నుంచి చెంచాలను తయారు చేయగలిగారు.
  • ఎస్సీలు, వెనకబడిన తరగతులనే వారి మధ్య ఐక్యతపై దృష్టిసారించాను. ఈ రెండు తరగతుల వారి అవసరం ఒకటే అయినా కలవలేకపోవడం దయనీయం. అట్లా ఆలోచించడానికి కారణం వారు షెడ్యూల్డు కులాలవారికి దగ్గరైతే తమస్థాయి షెడ్యూల్డు కులాలవారి స్థాయికి దిగజారిపోతుందని వెనుకబడిన తరగతుల భయం. వీళ్ళమధ్య కంచం పొత్తు, మంచం పొత్తు వెంటనే ఏర్పాడాలని నేనేమి హడావుడి పడడంలేదు. వాళ్ళు వేర్వేరు తరగతులుగానే ఉంటారు. అయితే తమ వెనకబాటుతనాన్ని పోగొట్టుకోవడానికి వీళ్ళతో కలిసి ఒక రాజకీయపార్టీ ఏర్పరచడానికి ఎందుకు సహకరించరు?
  • షెడ్యూల్డు కులాలు వెనకబడిన తరగతులు కలిస్తే ఈ దేశంలో మెజారిటి సంఖ్య అవుతారు. వాళ్ళు ఈ దేశాన్ని ఎందుకు పాలించకూడదు? కావలసిందల్లా రాజకీయాధికారం కోసం ఒకటిగా కలవడం. వయోజన ఓటింగు విధానం ఉండగా అధికారం మీదే. అయినా ఈ ప్రయత్నం చెయ్యడానికి సాహసించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటున్నారు. ఇది తప్పుడు అభిప్రాయమని చెప్పాను. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతంగా పాలించలేరు. నెహ్రు, పటేలవంటి ప్రముఖ రాజకీయనాయకులు స్థాపించిన పార్టీకైనాసరే అది అసాధ్యం. మీరు సమీకృతులయితే అధికారాన్ని సులభంగా సాధించుకోవచ్చు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *