- తెలుగు రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో అక్రమాలు!
- తెలంగాణలో 74 శాతం కబ్జా కోరల్లోనే
- ఆంధ్రప్రదేశ్ లో 30 వేల ఎకరాలు మాయం
- రూ. వేల కోట్ల విలువైన ఆస్తులు పక్కదారి
- 28 నుంచి ఢిల్లీ ఐఐటీ బృందంతో సర్వే…
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తుల దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఎన్ని ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి? ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? అనే అంశాలపై తాజాగా ఒక నివేదిక వెలువడింది.
తెలంగాణలో 74% వక్ఫ్ భూములు కబ్జా!
తెలంగాణలో వక్ఫ్ బోర్డు పరిధిలో మొత్తం 33,929 ఆస్తులు ఉండగా… వాటి విస్తీర్ణం 77,538 ఎకరాలుగా తేలింది. ఇది కేవలం వ్యవసాయ భూమి మాత్రమే. షాపింగ్ కాంప్లెక్స్లు, భవనాలు వంటి ఇతర ఆస్తులు దీనికి అదనం. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ 77,538 ఎకరాల్లో దాదాపు 74 శాతం అంటే 57,423 ఎకరాల భూమి కబ్జాదారుల చేతుల్లో ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14,785 ఎకరాల వక్ఫ్ భూమి ఉండగా, అందులో 13,480 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మెదక్ జిల్లాలో అత్యధికంగా 23,910 ఎకరాల వక్ఫ్ భూమి ఉండగా, ఖమ్మం జిల్లాలో అతి తక్కువగా 534 ఎకరాలు ఉంది.
ఆంధ్రప్రదేశ్లోనూ వేల ఎకరాలు మాయం!
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 90 వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. ఇందులో దాదాపు 30 వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. చిత్తూరు నగరంలో 6.31 ఎకరాల వక్ఫ్ భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఏళ్ల తరబడి సరైన పర్యవేక్షణ లేకపోవడం, క్షేత్రస్థాయిలో చూసేవారు లేకపోవడంతో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల్లో తేడా!
వక్ఫ్ ఆస్తులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2009లో ఒక పోర్టల్ను తీసుకొచ్చినా, రాష్ట్రాల వారీగా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 1,43,305 ఎకరాల వక్ఫ్ భూమి ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 78,229 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. అయితే ఇందులో ఎంత మేర కబ్జాకు గురైందో కేంద్రం స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కొత్త చట్టంతో ఏం జరగనుంది?
వక్ఫ్ ఆస్తులను అమ్మడం, కొనడం లేదా బదిలీ చేయడం చట్టరీత్యా సాధ్యం కాదు. అయితే కొత్తగా వచ్చిన చట్టంతో వక్ఫ్ బోర్డుకు ఉన్న కొద్దిపాటి భూములు కూడా కబ్జాదారుల పరం అవుతాయని తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం భూములు ఆక్రమణలో ఉండగా, కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తే ఉన్న భూములు కూడా చేజారిపోతాయని ఆయన వాపోతున్నారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేయాలని, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచిస్తున్నారు.
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన లక్షలాది ఎకరాల భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. కొత్త చట్టం ఈ ఆస్తులకు రక్షణ కల్పిస్తుందా లేదా మరింత ప్రమాదంలోకి నెడుతుందా వేచి చూడాలి.
ఢిల్లీ ఐఐటీ బృందంతో కేంద్రం సర్వే…
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐఐటీ-ఢిల్లీ బృందం తెలంగాణలో సర్వే నిర్వహించనుంది. జీపీఎస్, జీపీఆర్ఎస్ సాంకేతికతతో భూముల సరిహద్దులను గుర్తించి, ఆక్రమణలను నివారించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి హైదరాబాద్లో సర్వే ప్రారంభం కానుంది. వ్యవసాయ భూములను మాత్రమే ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకుంటారని, వ్యవసాయేతర ఆస్తుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది.