- ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డేటా అందజేత
- విజిల్ బ్లోయర్ సారా సంచలన ఆరోపణలు
- అమెరికా జ్యుడీషియరీ కమిటీ విచారణ
- రుజువైతే జుకర్ బర్గ్ కు కోర్టుల్లో చిక్కులు
- మెటాతో అమెరికా భద్రతకు ముప్పు?
సహనం వందే, వాషింగ్టన్:
అమెరికాకు చెందిన ప్రముఖ ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు చెందిన మెటా సంస్థ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజిల్ బ్లోయర్ సారా విన్-విలియమ్స్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సారా విన్-విలియమ్స్ తెలిపిన వివరాల ప్రకారం... మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా చైనా సెన్సార్షిప్ విధానాలను మరింత బలోపేతం చేయడానికి మెటా సాంకేతిక సాయం కూడా అందించిందని ఆమె వెల్లడించారు. ఈ చర్యల వలన అమెరికా యొక్క జాతీయ భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుందని, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఈ విషయాల గురించి కాంగ్రెస్కు అబద్ధాలు చెప్పారని సారా ఆరోపించారు.
మెటా సంస్థపై ప్రజల్లో అపనమ్మకం…
ఈ ఆరోపణలు మెటా సంస్థపై ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొంతమంది వినియోగదారులు ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణించాలని, దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు సాధారణ వినియోగదారులపై ఈ వివాదం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని భావిస్తున్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా సెనేట్ జ్యుడిషియరీ కమిటీ వెంటనే స్పందించింది. మెటా సంస్థ చైనా సంబంధాలపై పూర్తిస్థాయి విచారణను ప్రారంభించింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే, మార్క్ జుకర్బర్గ్పై కాంగ్రెస్ను తప్పుదారి పట్టించినందుకు అభియోగాలు మోపవచ్చని, అంతేకాకుండా ఈ కేసును న్యాయ శాఖకు కూడా అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయనకు కోర్టుల్లో అనేక చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఈ ఆరోపణలు నిజమో కాదో తెలుసుకోవడానికి లోతైన విచారణ జరగాల్సి ఉంది.