- ఒక్కో ముఖ్యమంత్రి ఒక్కో బ్రాండ్ ఉంది
- చంద్రబాబుకు ఐటీ… వైఎస్ కు ఆరోగ్యశ్రీ
- ఎన్టీఆర్ కు రూ. 2 కిలో బియ్యం బ్రాండ్
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
‘ప్రతీ ముఖ్యమంత్రికీ ఒక బ్రాండ్ ఉంటుంది. రూ. 2కే కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్.. ఐటీ అంటే చంద్రబాబు.. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారు. కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్ అని గొప్పలు చెప్పుకుంటారు.. యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నేను విశ్వసిస్తున్నా. యంగ్ ఇండియా మా బ్రాండ్గా, తరగతి గదులను బలోపేతం చేస్తాం” అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను గురువారం ప్రారంభించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు.
ప్రీ-స్కూల్ విధానంతో విద్యా సంస్కరణ…
ప్రభుత్వ విద్యా విధానంలోని లోపాలను సరిదిద్దేందుకు ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి వివరించారు. “ప్రైవేటు స్కూళ్లల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో 5 ఏళ్ల వయసు తప్పనిసరి కావడంతో విద్యార్థులు ప్రైవేటు వైపు మళ్లుతున్నారు. ఈ అస్పష్టతను తొలగించేందుకు నిరుపేదలకు ఉచిత రవాణాతో పాటు ప్రీ-స్కూల్ విద్యను అందిస్తాం” అని తెలిపారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ శుభారంభం
పోలీసు సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటైన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభిస్తూ, “విధి నిర్వహణలో ఉండే పోలీసులకు తమ పిల్లల చదువుపై దృష్టి సారించే సమయం లేకుండా పోతోంది. ఈ స్కూల్ వారి ఆందోళనలను తీరుస్తుంది” అని ముఖ్యమంత్రి అన్నారు.
విద్యా విధానంలో మార్పు అవసరం…
రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లలో 18.50 లక్షల మంది, 11,500 ప్రైవేటు స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. “అత్యుత్తమ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు రాకపోతే, విధానంలో లోపం ఉందని గుర్తించాం. దీన్ని సరిదిద్దేందుకు ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశాం” అని తెలిపారు.
స్కిల్స్ యూనివర్సిటీతో ఉద్యోగ భరోసా…
“పెద్ద సంస్థలతో కలిసి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. మొదటి బ్యాచ్కు నూటికి నూరు శాతం ఉద్యోగాలు వచ్చాయి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీలను కూడా ప్రారంభించాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
పోలీస్ స్కూల్కు ప్రభుత్వ హామీ…
“పోలీస్ స్కూల్ను ఒక బ్రాండ్గా తీర్చిదిద్దండి. కేజీ నుంచి పీజీ వరకు అభివృద్ధి చేయండి. నిధులు, అనుమతుల్లో ఎలాంటి ఇబ్బంది రాదు” అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కార్పొరేట్ సంస్థల నుంచి వంద కోట్ల కార్పస్ ఫండ్ సమీకరించాలని సూచించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లతో సామాజిక చైతన్యం…
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం 58 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. “విద్యలో రాజీ పడొద్దు. పిల్లల్లో స్ఫూర్తిని నింపండి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీజీపీ జితేందర్, పోలీస్ స్కూల్ ఇంచార్జ్ సీవీ ఆనంద్ తదితరులు హాజరయ్యారు.