కంచ గచ్చిబౌలి భూములపై ‘ఏఐ’ రచ్చ

  • నెమళ్లు ఏడుస్తున్నట్లు… బుల్డోజర్లకు జింకలు గాయపడుతున్నట్లు
  • అవతార్ సినిమా మాదిరిగా ఏఐ ఫోటోలు… దీంతో జాతీయస్థాయి ప్రచారం…
  • ఫేక్ వీడియోలపై సీఎం సీరియస్… ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి
  • ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకు పెను సవాల్ అని విమర్శ
  • ఏఐ నకిలీ కంటెంట్‌ను గుర్తించే ఫోరెన్సిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లను సమకూర్చుకోవాలని ఆదేశం

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు ఏఐని ఉపయోగించి సృష్టించిన తప్పుడు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవాలు వెల్లడించే లోపే అబద్ధాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అభిప్రాయపడుతుంది. నెమళ్లు ఏడుస్తున్నట్లుగా ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడుతున్నట్లుగా నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించారని పోలీసు అధికారులు అంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల కేసులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు.

ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఆందోళన…
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించే నకిలీ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన ప్రమాదకరమైనవని సమావేశం అభిప్రాయపడింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో గత 25 ఏళ్లుగా ఐఎస్‌బీ, గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు భవనాలు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, హెచ్‌సీయూ భవనాలతో సహా అనేక ప్రాజెక్టులు నిర్మించారు. అయితే, వాటి నిర్మాణ సమయంలో ఎలాంటి వివాదాలు తలెత్తలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ లేదా పర్యావరణ విధ్వంసం వంటి సమస్యలు కూడా లేవని వారు పేర్కొన్నారు. అదే సర్వే నెంబర్‌లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేస్తుంటే వివాదాస్పదం కావడానికి గల కారణాలపై సమావేశంలో చర్చించారు.

ప్రముఖుల స్పందనపై విమర్శలు…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా టాండన్ వంటి ప్రముఖులు కూడా ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ ఫొటోలు, వీడియోలను నిజమని నమ్మి పోస్ట్ చేయడం ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని సమావేశంలో చర్చించారు. జర్నలిస్ట్ సుమిత్ ఝా మొదటగా ఈ నకిలీ వీడియోను పోస్ట్ చేసినప్పటికీ, వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పారని, అయితే ఇతర ప్రముఖులు మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేశారని అధికారులు తెలిపారు.

ప్రజాస్వామ్యంపై ఏఐ ప్రభావం…
కంచ గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకు పెను సవాలుగా మారిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో అంతర్జాతీయ సంబంధాలు, సరిహద్దు వివాదాలు వంటి సున్నితమైన అంశాల్లో ఏఐతో నకిలీ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని చర్చించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏఐ నకిలీ కంటెంట్‌ను గుర్తించడానికి అవసరమైన అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సాధనాలను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *