– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అత్యాధునిక ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత చండీగఢ్ తరహాలో సంపూర్ణ నగరం ఏర్పాటు కాకపోవడాన్ని సీఎం విమర్శించారు. హైదరాబాద్కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. మూసీ నది ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రణాళికలతో పాటు ఈ కొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని బడ్జెట్ను ‘షడ్రుచుల సమ్మేళనం’గా సీఎం అభివర్ణించారు.
యువత, రైతులు, పేదల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, పేదలకు వైద్యం, విద్య వంటి ప్రాథమిక సదుపాయాలను అందించేందుకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు. ఈ ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. “శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలకు అందుతుంది. తెలంగాణలో ధాన్య ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం” అని ఆయన గర్వంగా పేర్కొన్నారు. “తెలంగాణ రైజింగ్ 2050” ప్రణాళికతో రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దాలని సీఎం సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. “సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కరుణిస్తాడ”ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.