దక్షిణాది దెబ్బకు ఢిల్లీ పీఠాలు దద్దరిల్లాల్సిందే..

   33 శాతం సీట్ల కోసం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం..
– బీజేపీపై దక్షిణాది సీఎంల భీకర యుద్ధం… చెన్నై వేదికగా గళం
– తదుపరి దక్షిణాది సీఎంల సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటన

సహనం వందే, హైదరాబాద్‌
లోక్‌సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాలను కదిలించేలా గర్జించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యాయమైన పునర్విభజన’ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఉగ్రరూపం దాల్చారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం భీకర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు.
దక్షిణాది దెబ్బకు ఢిల్లీ దిమ్మ తిరగాల్సిందే!
దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ, ఆర్థిక వృద్ధి, సుపరిపాలనలో ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. జీడీపీ, తలసరి ఆదాయం, ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని రుజువులతో సహా వివరించారు. కేంద్రానికి పన్నుల రూపంలో ఎక్కువ సహకారం అందిస్తున్నా, తిరిగి వచ్చే నిధులు మాత్రం అరకొరగా ఉంటున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంటులో 33 శాతం సీట్లు కేటాయించకపోతే, ఢిల్లీ పీఠాలు దద్దరిల్లిపోయేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
బీజేపీ ఆటలు సాగనివ్వం.. దక్షిణాది సీఎంల ఐక్య యుద్ధం!
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1971 నుంచి జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు, అదే నియంత్రణ చేయని ఉత్తరాది రాష్ట్రాలకు అసమాన న్యాయం జరుగుతోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి దక్షిణాది సీఎంలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పన్నుల పంపిణీలో ఢిల్లీ కుట్ర.. దక్షిణాది సీఎంల భీకర ఆరోపణలు!
సమావేశంలో పాల్గొన్న నేతలు, కేంద్ర ప్రభుత్వం పన్నుల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత చూపిస్తోందని భీకర ఆరోపణలు చేశారు. తమిళనాడు కేంద్రానికి చెల్లించే ప్రతి రూపాయికి కేవలం 29 పైసలు మాత్రమే తిరిగి వస్తోందని, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా నిధులు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ.. ఢిల్లీకి దక్షిణాది సత్తా చాటుదాం!
దక్షిణాది రాష్ట్రాల డిమాండ్లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని, ఢిల్లీకి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

“దక్షిణాది గొంతుకను ఢిల్లీ వినేలా చేద్దాం.. ఐక్య పోరాటం చేద్దాం”

“దక్షిణాది రాష్ట్రాల పౌరుల గొంతుకను బలంగా, ఐక్యంగా దేశమంతటికీ వినిపిద్దాం” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనసభలో త్వరలో ఈ అంశంపై తీర్మానం ఆమోదిస్తామని, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

జగన్ లేఖ.. షర్మిల ధ్వజం!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల మాట్లాడుతూ, “సొమ్ము దక్షిణాది రాష్ట్రాలది, సోకు ఉత్తరాది రాష్ట్రాలది” అనే పరిస్థితి తలెత్తుతోందని ధ్వజమెత్తారు. ఈ దోపిడీని అరికట్టడానికి అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *