సహనం వందే, హైదరాబాద్:
జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూడడం న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో హోలీ పండుగ రోజున జరిగిన అగ్నిప్రమాదం న్యాయవ్యవస్థను కుదిపేసింది. మంటలార్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు కట్టలు లభ్యమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయమూర్తి ఇంట్లో బయటపడిన ఈ నగదు వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి చేరడంతో, ఆయన వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. గతంలో అలహాబాద్ హైకోర్టులో పనిచేసిన వర్మ 2021లో ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. 1969 జనవరిలో అలహాబాద్లో జన్మించిన జస్టిస్ యశ్వంత్ వర్మ, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.కామ్ పట్టా పొందిన అనంతరం, మధ్యప్రదేశ్లోని రేవా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1992 ఆగస్టు నుండి న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఆయన, 2014 అక్టోబర్లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఫిబ్రవరిలో అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, 2021 అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవాదిగా సివిల్ కేసులలో ప్రత్యేకత సంపాదించిన ఆయన, రాజ్యాంగ, పారిశ్రామిక, కార్పొరేట్, పన్నులు, పర్యావరణ విషయాలపై కూడా వాదించారు.