సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్ మినిస్ట్రీ ఏషియా హెడ్ రెబెకా రిడ్డర్ ఆధ్వర్యంలోని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు 55 నుండి 60 శాతం వరకు ఉన్నారని, వారి సమస్యలకు సాంకేతికత పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. సాగు వ్యయం తగ్గించి రైతులకి మేలు చేసే కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విదేశాల్లో మాదిరిగానే మన దగ్గర కూడా మానవ ప్రమేయం లేకుండా “అగ్రి రోబో”లతో వ్యవసాయం చేసే రోజులు త్వరలోనే వస్తాయని, దీనికి సంబంధించిన పరిశోధనలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంపై జర్మనీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు డా. సెబాస్టియన్ బోస్, మార్టిన్, స్వెన్, డా. రఘు చాలిగంటి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. జానయ్య, రీసెర్చ్ డైరెక్టర్ డా. బలరాం, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డా. రాములు, డిజిటల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డా. బాలాజీ నాయక్ పాల్గొన్నారు.