సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, వడగళ్ల వాన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెదక్ జిల్లాలో పెను నష్టం సంభవించింది. మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో ఒక ఇంటిపై పిడుగు పడటంతో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మెదక్ పట్టణంతో పాటు మెదక్ రూరల్, పాపన్నపేట, కోల్చారం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కోల్చారం మండలం పోతంశెట్టిపల్లి వద్ద సుడిగాలి బీభత్సం సృష్టించింది. రోడ్డు వెంట ఉన్న చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోతంశెట్టిపల్లిలో కొన్ని రేకుల షెడ్లు పునాదులతో సహా కూలిపోయి 200 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. కిరాణా సామాన్లు చిందరవందరగా పడ్డాయి. పోతంశెట్టిపల్లి వైన్స్ సమీపంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ఒక వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. ఏడుపాయలకు వెళ్లే దారిలో రేకుల షెడ్డు కారుపై పడటంతో ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఆటో కూడా రోడ్డుపై పడిపోయింది. మెదక్-హైదరాబాద్ రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. ధర్పల్లి మండలం వాడి గ్రామంలో వరి ధాన్యం నేలరాలాయి. పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
కలెక్టర్లతో సిఎస్ టెలికాన్ఫెరెన్స్…
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురిసిన వడగళ్ల వాన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగళ్ల వాన వల్ల నెలకొన్న పరిస్థితులను ఆమె సమీక్షించారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. రానున్న 48 గంటల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అకాల వర్షాల వల్ల ఏర్పడే నష్టాల అంచనాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు.
తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం- అనేక చోట్ల నష్టపోయిన రైతులు
